
మెదక్, వెలుగు: మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ వద్ద ఉన్న వన విజ్ఞాన కేంద్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. 20వ శతాబ్ది ప్రారంభంలో నిజాం రాజు మీర్ఉస్మాన్అలీ ఖాన్ హయాంలో ఈ ప్రాంతాన్ని వేట విడిది కేంద్రంగా అభివృద్ధి చేశారు. అప్పట్లోనే ఇక్కడ రెండు గెస్ట్హౌజ్లు నిర్మించారు. 1952లో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. వివిధ రకాల వృక్షాలు, జంతువులతో జీవ వైవిధ్యానికి నిలయంగా మారిన ఈ అభయారణ్యం వద్ద ఫారెస్ట్ ప్లస్ 2. వో పథకంలో భాగంగా రూ.43.23 లక్షలతో బిల్డింగ్ నిర్మించి అందులో వన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అడవుల్లో ఉండే వివిధ రకాల వన్య ప్రాణులు, వాటి జీవన విధానం, వాటి వల్ల పర్యావరణానికి కలిగే మేలు గురించి తెలియజేసేలా దీనిని తీర్చిదిద్దారు. మెదక్-కామారెడ్డి జిల్లాల పరిధిలో 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యంలో చిరుతలు, ఎలుగుబంట్లు, నీల్గాయ్లు, సాంబార్ లు, చుక్కల దుప్పిలు, కొండ గొర్రెలు, అడవి పందులు, అలుగులు, కుందేళ్లు, నెమళ్లు, పోలీస్తొండ, వివిధ రకాల సర్పాలు, కొండ చిలువలు, కొంగలు, తదితర పక్షులు ఉన్నాయి.
Also Read :- కొమురవెల్లి పుణ్యక్షేత్రం..రైల్వేస్టేషన్గా నామకరణం
వన విజ్ఞాన కేంద్రంలో అభయారణ్యంలో ఉన్న వన్యప్రాణుల గురించి సవివరంగా తెలియజేసేలా బొమ్మలతోపాటు, స్పిన్ బోర్డులు, ఫొటోలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచే కాక హైదరాబాద్ నుంచి స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ వందలాది మంది ఈ విజ్ఞాన కేంద్రం సందర్శనకు వస్తున్నారు. విద్యార్థులతో పాటు, ప్రకృతి ప్రేమికులను సైతం ఈ వన విజ్ఞాన కేంద్రం విశేషంగా ఆకట్టుకుంటోంది.