
- ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం
- సీఎం రేవంత్తో భేటీలో సంస్థ ప్రతినిధుల వెల్లడి
- దేశంలోనే ఇది తొలి కార్యాలయం
- నాలుగేండ్లలో 2,300 మందికి ఉద్యోగావకాశాలు
- ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజినీరింగ్లో జాబ్స్
- హైదరాబాద్ను జీసీసీ హబ్గా చేస్తం: సీఎం రేవంత్
- ప్రభుత్వ సానుకూల పాలసీల వల్లే
- హైదరాబాద్ను ఎంచుకున్నం: వాన్గార్డ్ సీఈవో
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. మన దేశంలో ఈ కంపెనీ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే కావడం విశేషం. సోమవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో వాన్ గార్డ్ ప్రతినిధి బృందం భేటీ అయింది. వాన్గార్డ్ సీఈవో సలీం రాంజీ, ఐటీ డివిజన్ సీఐవో, ఎండీ నితిన్ టాండన్, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ -వాన్గార్డ్ ఇండియా హెడ్ వెంకటేశ్ నటరాజన్ నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొన్నది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో జీసీసీ ఏర్పాటు నిర్ణయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్టు తెలిపింది. రాబోయే నాలుగేండ్లలో 2,300 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు
వెల్లడించింది.
సహకారం అందిస్తం: సీఎం రేవంత్
హైదరాబాద్ లో వాన్ గార్డ్ జీసీసీ ఏర్పాటుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా హైదరాబాద్ను ప్రపంచస్థాయి జీసీసీ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వాన్గార్డ్ రాకతో ప్రపంచస్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుందని తెలిపారు. మన దేశంలోని ప్రతిభను ఉపయోగించుకోవడానికి, సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వం తరఫున తగినంత సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.
హైదరాబాద్లో వైవిధ్యమైన ప్రతిభతోపాటు జీవన నాణ్యత, సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని వాన్గార్డ్ కంపెనీ సీఈవో సలీం రాంజీ అభిప్రాయపడ్డారు. వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, సానుకూల పాలసీల వల్లే హైదరాబాద్ను తమకు అనువైన చోటుగా ఎంచుకున్నామని చెప్పారు. తమ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలను అందించడంతోపాటు ఏఐ, మొబైల్, క్లౌడ్ టెక్నాలజీలో ప్రతిభావంతులైన ఇంజినీర్లకు అవకాశాలు కల్పిస్తుండడం తమకు సంతోషంగా ఉందన్నారు.
10 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల కంపెనీ
వాన్గార్డ్ ప్రపంచంలోనే పేరొందిన పెట్టుబడి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఈ కంపెనీ నిర్వహిస్తున్నది. 50 మిలియన్లకు పైగా పెట్టుబడిదారులకు తమ సేవలు అందిస్తున్నది. హైదరాబాద్ లో వాన్ గార్డ్ ఏర్పాటు చేసే కేంద్రం ఇన్నోవేషన్ హబ్గా పనిచేయనున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మొబైల్ ఇంజినీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అందుకు అవసరమైన ఇంజినీర్లను తక్షణమే నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నది.