
గదర్ అంటే విప్లవం లేదా తిరుగుబాటు. ఈ సంస్థను హిందుస్థాని గదర్ పార్టీగా పిలిచారు. ఈ పార్టీని 1913, నవంబర్ 1న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని యుగాంతర్ ఆశ్రమంలో లాలా హరదయాల్ (ప్రధాన కార్యదర్శి) స్థాపించాడు. ఈ సంస్థకు అధ్యక్షుడు సోహన్ సింగ్ భక్నా, కోశాధికారిగా పండిత్ కాశీరాం పనిచేశారు. ఈ పార్టీలో ముఖ్య సభ్యులుగా కర్తార్సింగ్ శరభా, భాయ్ ప్రేమానంద, సర్దార్ బలవంత్ సింగ్, పండిట్ కాన్షీరాం, రామచంద్ర భరద్వాజ్లు ఉండేవారు. గదర్ పార్టీ జర్మనీ దేశానికి అనుకూలంగా ప్రవర్తించింది.
స్వేచ్ఛ, సమానత్వం, భారత్లో బ్రిటిష్ పాలన అంతం లక్ష్యంగా గదర్ పార్టీ పనిచేసింది. ఈ పార్టీ గదర్ లేదా హిందుస్థాన్ గదర్ అనే పత్రికను ప్రారంభించింది. ఈ పత్రిక మొదటి పేజీలో అంగ్రేజికా రాజ కచ్చాచిత్తా అనే హెడ్లైన్తో వరుసగా కథనాలు ప్రచురించింది. ఈ పత్రిక మొదటి ప్రతి ఉర్దూలో 1913 నవంబర్ 1న ప్రచురితమైంది. రెండో ప్రతి గురుముఖి భాషలో అదే సంవత్సరంలో వెలువడింది. గురుముఖి భాషలోని గదర్ పత్రికకు కర్తార్ సింగ్, ఎడిటర్గా పనిచేశారు. ఇంగ్లీష్ భాషలో ప్రచురించిన గదర్ పత్రికకు లాలా హరిదయాల్ సంపాదకుడిగా పనిచేశాడు.
భాయి భగవాన్ సింగ్ గదర్ దీ గూంజ్ పేరిట విప్లవ గేయాలను రచించాడు. మొదటి లాహోర్ కుట్ర కేసు: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1915, ఫిబ్రవరిలో బ్రిటిష్ పాలన అంతం చేయడానికి గదర్ పార్టీ యవద్భారత తిరుగుబాటుకు ప్రయత్నించింది. దీనినే గదర్ తిరుగుబాటు అంటారు. ఇది విఫలమవడంతో 291 నేరారోపణ రుజువైన విప్లవ ఖైదీలకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 1915 మధ్య కేసు ట్రయల్స్ లాహోర్లో జరిగాయి. ఇందుకోసం అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ విప్లవాత్మక కార్యకలాపాలను అణచడానికి భారత రక్షణ చట్టం – 1915 ను తీసుకువచ్చి, ఆ చట్టం కింద లాహోర్ కుట్రకేసు విచారణను అమలు చేశారు.