రాజన్న ఆలయ తలనీలాలు కొనేందుకు ముందుకురాని కాంట్రాక్టర్లు

రాజన్న ఆలయ తలనీలాలు కొనేందుకు ముందుకురాని కాంట్రాక్టర్లు
  • ఆన్​లైన్​ లో టెండర్లు వేసిన తమిళనాడుకు చెందిన సంస్థలు  
  • బహిరంగ వేలానికి హాజరైనా పాల్గొనని ఇద్దరు కాంట్రాక్టర్లు

వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న ఆలయం లో తలనీలాలకు టెండర్​ధర ఆశించిన స్థాయిలో రాలేదు. శుక్రవారం ఆలయంలో వేలం పాటు వేశారు. గత రెండేండ్ల కింద టెండర్​లో రూ. 19 కోట్ల వరకు పలికింది.  ఈసారి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. పాత పాటతో ప్రారంభించగా బహిరంగ వేలంలో రూ. 50 లక్షల డీడీలు చెల్లించిన సికింద్రాబాద్ కు చెందిన నాగకుమారి ఎంటర్ ​ప్రైజెస్​, కళావతి ఎంటర్​ ప్రైజెస్​ నిర్వాహకులు హాజరైనా పాటలో పాల్గొనలేదు. 

కాగా.. తమిళనాడుకు చెందిన కేఎమ్​హెయిర్ ఇంటర్నేషనల్ సంస్థ రూ. 12 . 75 కోట్లు,  దురై ఎంటర్​ ప్రైజెస్​ సంస్థ  రూ. 13. 67 కోట్లకు ఆన్ లైన్ టెండర్లు వేశాయి.  ఆలయ పాటకు కాంట్రాక్టర్లు పాటకు మధ్య రూ. 6 కోట్ల తేడా ఉండడంతో  నిలిపివేసి..  దేవాదాయ కమిషనర్ కు నివేదిక పంపినట్లు ఆలయ ఈఓ వినోద్​రెడ్డి తెలిపారు. విదేశాల్లో ధరలు తగ్గడం, అలయ అభివృద్ధి పనులు ప్రారంభమైతే భక్తుల సంఖ్య తగ్గే చాన్స్ ఉందనే భయంతోనే టెండర్​లో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదని తెలిసింది. 

పాత బకాయిలే రూ. 3.50 కోట్లు

రెండేండ్ల కింద ఏపీలోని హిందుపురానికి చెందిన సుమితి ఎంటర్​ప్రైజెస్​ రూ. 19.8 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఈనెల11న పాత కాంట్రాక్టర్​గడువు ముగిసింది.  ఇంకా  రూ. 3 .50 కోట్లు చెల్లించాలి.  కాగా.. కాంట్రాక్టర్​కు ​వచ్చే డిసెంబర్ 25​ వరకు వెసులుబాటు కల్పించడంపై  విమర్శలు వస్తున్నాయి. 

ఆలయ నిర్వహణలోనే కల్యాణ కట్ట  

శుక్రవారం నుంచి పాత కాంట్రాక్టర్​గడువు ముగియడంతో పాటు కొత్త కాంట్రాక్ట్ కు ​ఇంకా ఎవరికి ఇవ్వకపోవడంతో శనివారం నుంచి కల్యాణకట్ట ఆలయ నిర్వహణ పరిధిలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఆలయ సేవాదారులు, సూపర్​ వైజర్లు, పర్యవేక్షకులు నిర్వహణ చూస్తారన్నారు.