
కాకా వెంకటస్వామి పేరుపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా క్రికెట్ కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఆయన తన సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కుమారుడు వంశీకృష్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో వరల్డ్ కప్ నిర్వహణ కాకా వెంకటస్వామి వలన జరిగిందన్నారు వివేక్. బీసీసీఐ ఏర్పాటులో కాకా కృషి ఉందన్నారు. హెచ్ సీఏ అధ్యక్షులుగా తాను , వినోద్ పనిచేసి క్రికెట్ ఆటను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లామన్నారు. హెచ్ సీఏ ఆధ్వర్యంలో జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ లను నిర్వహించామని వెల్లడించారు. దీనివల్ల రూరల్ క్రికెటర్స్ బయటకు వచ్చారని తెలిపారు.
యావత్ భారతదేశంలో క్రికెట్ క్రేజ్ పెరగడానికి కాకా కుటుంబం ఒక కారణమని చెప్పారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. హైదరాబాద్ లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోతే విశాక ఇండస్ట్రీస్ ద్వారా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఉప్పల్ లో నిర్మించామని తెలిపారు. ఐసీసీ చాంపియన్స్ 2006 ట్రోఫీని ఇండియాలో నిర్వహణకు కాకా వెంకటస్వామి కృషి చేశారని వినోద్ చెప్పారు.
స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయడానికి కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నామన్నారు గడ్డం వంశీ. మండల స్థాయిలో 35 రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు, నియోజకవర్గ స్థాయిలో 21 మ్యాచ్ ల నిర్వహణ ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఇండియా టీమ్ లో క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నట్లుగా వెల్లడించారు. విన్నర్ కు మూడు లక్షల ప్రైజ్ మనీ... రన్నరప్ కు 2 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పారు. ప్రతి సంవత్సరం కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.