
- ఓఎఫ్ఎస్ రూట్లో వాటాలు అమ్ముకోవడానికి మొగ్గు
- మార్కెట్ పెరుగుతుండడం, ఐపీఓల సక్సెస్ కారణం
- జనవరి-ఆగస్టు మధ్య రూ.26,924 కోట్ల సేకరణ
న్యూఢిల్లీ : మార్కెట్ కొత్త గరిష్టాలను టచ్ చేస్తుండడం, ఐపీఓ మార్కెట్ ఫుల్ జోష్లో ఉండడంతో వెంచర్ క్యాపిటలిస్టు (వీఈ) లు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) కంపెనీలు భారీగా లాభపడుతున్నాయి. ఈ పరిస్థితులను వాడుకొని తమ వాటాలను మంచి ధరలకు అమ్ముకుంటున్నాయి. ఐపీఓ డేటా ప్రకారం, ఈ ఏడాది కంపెనీలు ఫ్రెష్గా షేర్లను ఇష్యూ (ఫ్రెష్ ఇష్యూ) చేయడం ద్వారా కంటే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారానే ఎక్కువ ఫండ్స్ను సేకరించాయి.
సాధారణంగా ఫ్రెష్ షేర్ల ఇష్యూ సైజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఐపీఓల్లో అమ్ముడైన షేర్లలో ఓఎఫ్ఎస్ వాటా 50.37 శాతంగా ఉంటే, ఫ్రెష్ ఇష్యూ వాటా 49.63 శాతంగా రికార్డయ్యింది. ఓఎఫ్ఎస్ కింద ఇప్పటికే ఉన్న షేర్హోల్డర్లు తమ వాటాలను అమ్ముతారనే విషయం తెలిసిందే. దీనికింద సేకరించిన ఫండ్స్ సంబంధిత షేర్హోల్డర్కు వెళతాయి. అదే ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్ను కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాలకు, అప్పులు తీర్చడానికి, కార్పొరేట్ అవసరాలకు వాడుతుంది.
ఓఎఫ్ఎస్ రూట్లో మరిన్ని ఇష్యూలు
ఈ ఏడాది జనవరి–ఆగస్టు మధ్య 50 ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి. ఇవి ఓఎఫ్ఎస్ కింద మొత్తం రూ.26,924 కోట్లను సేకరించాయి. ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా సేకరించిన రూ.26,528 కోట్ల కంటే ఇది కొద్దిగా ఎక్కువ. ఈ ఏడాది జులై వరకు కూడా ఫ్రెష్ ఇష్యూ సైజ్ ఎక్కువగా ఉంది. తాజాగానే ట్రెండ్లో మార్పు వచ్చిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది జులై 31 నాటికి 43 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.47,872 కోట్లను సేకరించాయి.
ఇందులో ఫ్రెష్ ఇష్యూ వాటా 51.51 శాతం ఉంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.24,657 కోట్లను సేకరించగా, ఓఎఫ్ఎస్ కింద రూ.23,214.67 కోట్లను సేకరించాయి. ప్రస్తుతం ఐపీఓ మార్కెట్ ఆకర్షణీయంగా ఉందని, రానున్న క్వార్టర్లలో ఓఎఫ్ఎస్ ద్వారా ఫండ్స్ సేకరించడం మరింత పెరుగుతుందని వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ క్రాంతి బతిని అన్నారు. ఓఎఫ్ఎస్ రూట్లో వాటాలను అమ్మాలని ప్రభుత్వ కంపెనీలు కూడా ప్లాన్ చేస్తున్నాయని చెప్పారు.
2023, 2022 లో కూడా ఫ్రెష్ ఇష్యూ కంటే ఓఎఫ్ఎస్ కింద ఎక్కువ ఫండ్స్ను కంపెనీలు సేకరించాయి. కిందటేడాది ఫ్రెష్గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.20,662 కోట్లను సేకరించిన ఐపీఓలు, ఓఎఫ్ఎస్ రూట్లో రూ.28,772 కోట్లను సేకరించాయి. అదే 2022 లో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.17,658 కోట్లను, ఓఎఫ్ఎస్ కింద రూ.41,642 కోట్లను సేకరించాయి.