
- ఇది దేశంలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి
- రూ.550 కోట్ల ఖర్చుతో సముద్రంపై 2 కి.మీ. మేర నిర్మాణం
- రామేశ్వరం–తాంబరం ప్రత్యేక రైలుకూ పచ్చజెండా ఊపిన ప్రధాని
- కార్యక్రమానికి హాజరు కాని తమిళనాడు సీఎం స్టాలిన్
- సంతకమైనా తమిళంలో చేయండి.. డీఎంకే నేతలకు మోదీ చురకలు
చెన్నై: భారత ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరంతో కలుపుతూ కేంద్ర సర్కారు నిర్మించిన పంబన్బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని, ఆదివారం దీన్ని జాతికి అంకితం చేశారు. దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ బ్రిడ్జి కింది నుంచి ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది.
దీని నిర్మాణానికి దాదాపు రూ.550 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరం – తాంబరం ప్రత్యేక రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కొత్త బ్రిడ్జి మీదుగా ఈ రైలు పరుగులు పెట్టింది. ఇందులో స్టూడెంట్స్, ఇతర ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే, పంబన్బ్రిడ్జి కిందుగా ప్రయాణించిన కోస్ట్ గార్డ్ నౌకకూ మోదీ జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు పాల్గొనగా.. సీఎం స్టాలిన్ మాత్రంహాజరుకాలేదు.
సంతకమైనా తమిళంలో చేయండి: మోదీ
భాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్సహా ఆ రాష్ట్ర ఇతర నేతలకు ప్రధాని మోదీ చురకలంటించారు. తనకు తమిళనాడు లీడర్లనుంచి అనేక లెటర్లు వస్తుంటాయని, అందులో ఒక్కదానిపై కూడా తమిళంలో సంతకం చేసి ఉండవని ఎద్దేవా చేశారు. నిజంగా తమ భాషను ప్రేమించేవారైతే కనీసం ఆ భాషలోనైనా సంతకం పెట్టండి అని సూచించారు. పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడులో అధికార డీఎంకేపై విమర్శలు చేశారు.
దశాబ్ద కాలంలో రాష్ట్ర రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెరిగిందని, ఇంత గణనీయమైన వృద్ధి ఉన్నప్పటికీ కొంతమంది ఎలాంటి కారణం లేకుండా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మెడికల్ కోర్సులను తమిళ భాషలో అందించాలని, తద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని తమిళ సర్కారుకు సూచించారు. గత పదేండ్లలో తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
తమిళ భాష, తమిళ వారసత్వం ప్రపంచంలోని ప్రతి మూలకు చేరేలా కేంద్ర సర్కారు నిరంతరం కృషిచేస్తున్నదని చెప్పారు. పంబన్ వంతెన గురించి మాట్లాడుతూ.. ఇది 21వ శతాబ్దంలోనే ఇంజినీరింగ్ అద్భుతం అని అన్నారు. ప్రజల డిమాండ్ మేరకు ఈ బ్రిడ్జిని నిర్మించామని, ఇది రవాణాపరంగానే కాకుండా ఉపాధి, ఆదాయ వృద్ధికి ఎంతో ఉపయోగపడనుందని చెప్పారు.
వంతెన విశేషాలు
ఈ బ్రిడ్జిని రూ. 550 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) నిర్మించింది. దీన్ని 110 ఏండ్ల పాత పంబన్ వంతెన పక్కన నిర్మించారు.ఈ వంతెన 2.08 కిలోమీటర్ల పొడవు ఉంది. పాక్ జలసంధిపై నిర్మించిన ఈ బ్రిడ్జి రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగం(మండపం)తో కలుపుతుంది.ఈ బ్రిడ్జిలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ఉంది. దీంతో 17 మీటర్ల ఎత్తు వరకు ఎత్తొచ్చు. దీని కింది నుంచి నౌకలు సాఫీగా వెళ్లిపోవచ్చు. ఈ వంతెనపై రైళ్లు గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు
రెండు రైలు ట్రాక్లకు అనుగుణంగా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఒకే ట్రాక్ను కలిగి ఉన్నా.. భవిష్యత్తులో విస్తరింపజేయొచ్చు.
ఈ వంతెన రామేశ్వరం ద్వీపానికి రైలు కనెక్టివిటీని పునరుద్ధరిస్తుంది. యాత్రికులు, పర్యాటకులు, వాణిజ్యానికి మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది రామసేతుతో సంబంధం ఉన్న ప్రాంతంలో ఉండడం వల్ల సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉంది.