
ఎండాకాలం మొదలైంది. ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలకంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. పది దాటిందంటే చాలా హీట్ పెరిగిపోతుంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఎండలు..రాబోయే మూడు రోజులు మరింత పెరగనున్నట్లు వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది.
మార్చి3, 4 తేదీల్లో ఎండలు దంచికొడతాయని చెబుతోంది. ఉష్ణోగ్రతలు 2నుంచి 3 డిగ్రీల వరకుపెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్నాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఈ మూడు రోజులు 34 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని చెప్పింది. తీవ్రత పెరుగుతున్నదని వివరించింది.
ఈ ఎండా కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బయటికెళ్లేటప్పుడు నీళ్లు, చల్లని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపింది.
ఉదయం 11 తర్వాత బయటికి వద్దు
ఉదయం 11 గంటల తర్వాత చిన్న పిల్లలు, వృద్దులు, గుండెజబ్బులు, ఆస్తమా , మానసిక సమస్యలు ఉన్న వారు బయటికి వెళ్లొద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఎవైనా పనులుంటే ఉదయం 11గంటలలోపు.. సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలంటున్నారు.
హై టెంపరేచర్, వీక్నెస్, హెడెక్, తీవ్రమైన దాహం, చెమటలు రాకపోవడం, చర్మం ఎర్రగా మారడం, శ్వాస సమస్యలు, హార్ట్ బీట్ పెరగడం, వికారం, వాంతులు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలుంటే వడ దెబ్బ అని గ్రహించి ఆస్పత్రికి వెళ్లాలని కోరుతున్నారు.