
హైదరాబాద్సిటీ, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిచేసిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. రాముడిని అడ్డం పెట్టుకొని ధర్మంపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. బుధవారం సాయంత్రం వీహెచ్పీ సభ్యులు చిలుకూరులో రంగరాజన్ ను పరామర్శించారు.
అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. దాడి తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ధర్మం ముసుగులో కొంతమంది హిందుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వీహెచ్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్, డాక్టర్ సునీతారెడ్డి, నాయకులు చింతల వెంకట్ రెడ్డి, ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ పద్మశ్రీ, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి పాల్గొన్నారు.