భాగ్యనగరం.. శోభాయమానం..కనులపండువగా శ్రీరామ నవమి శోభాయాత్రలు.. జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన సిటీ

భాగ్యనగరం.. శోభాయమానం..కనులపండువగా శ్రీరామ నవమి శోభాయాత్రలు.. జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన సిటీ

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్/అంబర్‌‌‌‌‌‌‌‌పేట్, వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన శోభాయాత్రలు కనులపండువగా సాగాయి. జైశ్రీరామ్​నినాదాలతో భాగ్యనగరం మార్మోగింది. భాగ్యనగర్​శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సుమారు 5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర నిర్వహించగా, గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​ఆధ్వర్యంలో మరో శోభాయాత్ర 4 కిలోమీటర్లు సాగింది. అలాగే కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో ఇంకో శోభాయాత్ర నిర్వహించారు. 

హాజరైన గవర్నర్.. 

భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం వద్ద సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా నిర్వహించారు. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై శోభాయాత్రను  ప్రారంభించారు. ఈ యాత్ర సీతారాంబాగ్, మంగళ్‌‌‌‌హట్, ధూల్‌‌‌‌పేట, పురానాపూల్, జుమ్మేరాత్​బజార్, బేగంబజార్, ఛత్రి, సిద్దంబర్​బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి మీదుగా కోఠిలోని ఆంధ్రాబ్యాంక్​చౌరస్తా వరకు సాగింది.

గవర్నర్ జిష్ణుదేవ్​వర్మ మాట్లాడుతూ.. శ్రీరాముడు ధర్మస్థాపనకు మార్గదర్శకుడని, ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజం, దేశం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కాగా, ఆనంద్ సింగ్ ధూల్‌‌‌‌పేట​నుంచి సీతారాముల పల్లకి యాత్ర ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై ప్రారంభించారు. 

రాజాసింగ్ ఆధ్వర్యంలో..

గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర ఆదివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇందులో వేలాది మంది రామభక్తులు పాల్గొన్నారు. రాజాసింగ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ధూల్‌‌‌‌పేట్​ఆకాశపురి హనుమాన్ దేవాలయం వద్ద యజ్ఞం నిర్వహించి, హనుమాన్ చాలీసా పఠనం చేసి శోభాయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు.

ఈ యాత్ర ధూల్‌‌‌‌పేట్​జాలి హనుమాన్ మందిర్, పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్దంబర్ బజార్ మీదుగా హనుమాన్​వ్యాయామశాల వరకు సాగింది. రాజాసింగ్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం వక్ఫ్‌‌‌‌ బిల్లు తెస్తే ఒవైసీ బ్రదర్స్ గగ్గోలు పెడుతున్నారని, వారికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వక్ఫ్‌‌‌‌ బోర్డ్ రాకముందు 4వేల ఎకరాల భూములుండగా, బోర్డును అడ్డం పెట్టుకొని 9 లక్షల 50 వేల ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. 

కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో ..

అంబర్‌‌‌‌‌‌‌‌పేట శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాగ్​అంబర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లోని శ్రీరాముడి ఆలయం నుంచి నిర్వహించిన శోభాయాత్రను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ యాత్ర కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వరకు కొనసాగింది. కిషన్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత భక్తుల్లో మరింత పట్టుదల, భక్తిశ్రద్ధలు పెరిగాయని తెలిపారు. రానున్న రోజుల్లో హిందువుల్లో ఐక్యత మరింత పెరుగుతుందన్నారు.