ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​లో విజిలెన్స్​ రిపోర్ట్ కలకలం!

ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​లో  విజిలెన్స్​ రిపోర్ట్ కలకలం!
  • ఎలక్షన్లకు ముందు జరిగిన పనులపై ఎంక్వైరీ
  • పలు డిపార్ట్ మెంట్ల అధికారులపై చర్యలకు రంగం సిద్ధం 
  • పదుల సంఖ్యలో ఉద్యోగులకు షోకాజ్​నోటీసులు జారీ!  
  • కాంట్రాక్టర్​పై జరిమానా రూ.2కోట్ల నుంచి రూ.21 లక్షలకు తగ్గింపు 

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ లో విజిలెన్స్​ ఎంక్వైరీ రిపోర్ట్ కలకలం సృష్టిస్టోంది. కార్పొరేషన్​ లోని వివిధ విభాగాల్లోని సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులకు బుధవారం షోకాజ్​ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో అన్ని విభాగాల సిబ్బందిపై ఒకేసారి చర్యలకు రంగం సిద్ధం కావడంతో ఉద్యోగులతో పాటు కార్పొరేషన్​ లో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కార్పొరేషన్​ పరిధిలో జరిగిన కోట్లాది రూపాయల విలువైన పనులపై విజిలెన్స్​ ఎంక్వైరీ జరిగింది.

 ఒకే కాంట్రాక్టర్​కు రూ.20 కోట్లకు పైగా విలువైన పనులు చేయడంతో పాటు పనుల నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్​ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో కొద్దినెలల కింద కార్పొరేషన్​ఆఫీస్​లో విజిలెన్స్​అధికారులు వచ్చి ఫైళ్లను పరిశీలించడంతో పాటు ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు.

 సీసీ పనుల్లో రోడ్ల స్ట్రెంగ్త్ ను పరిశీలించారు. క్వాలిటీ లేకపోవడం, స్ట్రెంగ్త్ రాకపోవడంతో చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. నిర్లక్ష్యంగా పనులు చేసిన కాంట్రాక్టర్​ పై యాక్షన్​ తీసుకోకుండా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిద్ధమయ్యారు. 

కాంట్రాక్టర్​ పై జరిమానా తగ్గింపు! 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏడాది జరిగిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనుల నాణ్యతపై పలు ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఒక ముఖ్యనేతకు బినామీగా ప్రచారం జరిగిన ఒక కాంట్రాక్టర్​ కే పెద్ద సంఖ్యలో పనులు దక్కాయన్న విమర్శలున్నాయి. పనుల్లో క్వాలిటీ లేకుండా చేయడంతో పాటు అధికారులను మేనేజ్​ చేసుకుంటూ బిల్లులు చేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో విజిలెన్స్​ ఎంక్వైరీకి ఆదేశించారు. ఆర్నెళ్ల కింద వారం రోజులకు పైగా విజిలెన్స్​ అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీతో పాటు రికార్డులను పరిశీలించారు. ఆ సమయంలో సీసీ రోడ్లు స్ట్రెంగ్త్ రాకపోవడంతో కాంట్రాక్టర్​కు రూ.2 కోట్ల జరిమానా విధించినట్టు సమాచారం. అయితే తాజాగా వచ్చిన విజిలెన్స్​ రిపోర్ట్ లో మాత్రం ఆ జరిమానాను రూ.21 లక్షలకు తగ్గించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్​ నుంచి రికవరీ చేయాలని సిఫారసు చేసినట్టు సమాచారం. 

కాంట్రాక్టర్​కు సహకరించిన కొంతమంది ఉన్నతాధికారులను, బిల్లులు, ఫైళ్లపై సంతకాలు పెట్టిన ఆఫీసర్లను మినహాయించి కింది స్థాయిలోని ఈఈ, డీఈ, ఏఈ సహా సిబ్బందిపై షోకాజ్​ నోటీసులు, చర్యలకు సిఫారసు చేయడం వెనుక మతలబేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్​ చేసిన పనులను పరిశీలించాల్సిన వర్క్​ ఇన్స్​ పెక్టర్లు చాలా మంది ఔట్​ సోర్సింగ్ సిబ్బంది కావడంతో కాంట్రాక్టర్లకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం. 

ఆ తర్వాత వర్క్​ లను తనిఖీ చేయాల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కూడా కాంట్రాక్టర్​ మామూళ్ల మత్తులో పాజిటివ్​ రిపోర్ట్ ఇవ్వడంతో చకచకా ఫైళ్లు కదిలి బిల్లులు పాస్​ అయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం కాంట్రాక్టర్​ ను కాపాడేలా, ఉన్నతాధికారులను తప్పిస్తూ కింది స్థాయి సిబ్బందిని బాధ్యులను చేసేలా విజిలెన్స్​ రిపోర్ట్​ రావడం వెనుక చక్రం తిప్పిందెవరు అనే చర్చ జరుగుతోంది.