
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి జగన్ ను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజులు, రాజ్యాలు, కోటలు, కోటరీలు అంటూ విజయసాయి చేసిన ట్వీట్ జగన్ ను ఉద్దేశించినట్లు ఉండటం చర్చనీయాంశం అయ్యింది. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారని... కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని.. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేదని అన్నారు విజయసాయిరెడ్డి. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని అన్నారు.
కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడని... వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడని అన్నారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలని.. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలని అన్నారు. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ విజయసాయి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 15, 2025
ఇదిలా ఉండగా.. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాని.. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని వైసీపీని వీడిన విజయసాయి రెడ్డి ఇటీవల కాకినాడ పోర్ట్ కేసులో సీఐడీ విచారణకు హాజరైన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు చేసిన ట్వీట్ కూడా అదే జగన్ ను టార్గెట్ చేస్తూ ఉండటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.