
- నకిలీ విత్తనాలు అమ్మి మోసగిస్తే చర్యలు
- వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోపాల్
కొడంగల్, వెలుగు: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోపాల్ హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలతో నష్టపోయామని సోమవారం కొడంగల్లో రైతులు ఆందోళనకు దిగారు. ఎకరాకు 100 బస్తాల దిగుబడి వస్తుందని నాసిరకం విత్తనాలను టౌన్ లోని ఓం ట్రేగింగ్ కంపెనీ యజమాని నమ్మంచి అంటగట్టారని ఆరోపించారు.
ఎకరాకు రూ. 10వేల వరకు నష్టపోయామని తమను ఆదుకోవాలని రైతులు అధికారులను కోరారు. బుధవారం అధికారులు బాధిత రైతులను విచారించారు. డీఏఓ గోపాల్ మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులకు వారం రోజుల్లో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు మోసగిస్తే సహించేది లేదని, దుకాణాల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులతో పాటు ఏడీఏ శంకర్రాథోడ్, ఏఓ లావణ్య పాల్గొన్నారు.