
- టిప్పర్ లతో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మట్టి తరలింపు
- మట్టిని తొలగించి రోడ్డును చదును చేసిన టిప్పర్ యజమాని
- నుజ్జునుజ్జయిన టిప్పర్ ముందుభాగం.. లారీ డ్రైవర్ పరారీ
వికారాబాద్ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. పరిగిలో రాత్రి సమయంలో మట్టిని గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్నారు. మట్టి లోడ్ తో వెళుతున్న టిప్పర్ లారీడీ ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఆ తరువాత సినీ పక్కీలో అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదనే వాతావరణం ఉండేలా క్రియేట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే....
వికారాబాద్ జిల్లా పరిగిలో అర్థరాత్రి సినిమాఫక్కీ తరహాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏబీఎస్ ప్లాజా దగ్గర మట్టి లోడ్ తో ఉన్న టిప్పర్ ను గురువారం ( ఫిబ్రవరి 20) అర్దరాత్రి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందు భాగం నుజ్జునుజ్జైంది...టిప్పర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ స్థానికులు బయటకు తీశారు. లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.అక్రమంగా అర్థరాత్రి టిప్పర్ లో మట్టి తరలిస్తూ అతివేగంగా వెళ్తూ ఢీకొన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా .. అధికారులు పట్టించుకోవడం లేదు. పరిగిలో కొన్ని రోజులుగా మట్టి మాఫియా పెట్రేగి పోతున్న అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు.రాత్రి పగలు తేడా అనేదే లేదు... అనుమతులు లేకుండా విచ్చలవిడిగా పరిగి పరిసర ప్రాంతాల్లో గుట్టలను మాయం చేసేస్తున్నారు.
అందినకాడికి మట్టిని దోచుకొని ఎక్కువ ట్రిప్పులతో మట్టిని అక్రమంగా తరలించేందుకు అతివేగంతో నడుపుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే టిప్పర్ యజమాని ... మట్టిని తొలగించి తమకేమీ తెలియదన్నట్టు రోడ్డు పక్కన పోసి జేసీబీతో చదును చేయించాడు. మట్టి మాఫియా భాగోతం ఎక్కడ బయటపడుతోదనని ప్రమాదం జరిగినట్టు ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా అనంతరం పీఎస్ కు తీసుకురావలసిన టిప్పర్ ను జేసీబీతో రోడ్డు పక్కన చెట్లపొదల్లో దాచేశారు. అయితే ఈ ఘటనపై ఇంకా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇంకా కంప్లైంట్ రాలేదని పోలీసులు చెబుతున్నారు.