తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

యాదగిరిగుట్ట, వెలుగు: భూమి లేకున్నా మ్యుటేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట ఇన్​చార్జి తహసీల్దార్​ దేశ్యానాయక్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. యాదగిరిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 152లో ఓ రియల్టర్ కోసం తహసీల్దార్​ రెండెకరాల ల్యాండ్​ను మ్యుటేషన్ చేయడానికి ఫైల్ ను ఆర్డీవోకు ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. 

లేని భూమి ఉన్నట్లు 2.02 ఎకరాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా మ్యుటేషన్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వెంటనే మ్యుటేషన్ ను నిలిపివేసి అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

పోలీసులు వచ్చి సముదాయించడంతో వారు తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. పహానీ, పట్టాలో ఉన్న పేరుతోనే డిజిటల్ సిగ్నేచర్ కోసం ఫైల్ ను ఆర్డీవోకు ఫార్వర్డ్ చేశానని, మ్యుటేషన్ కోసం కాదని, డిజిటల్ సిగ్నేచర్ కోసం క్షేత్రస్థాయిలో భూమి ఉందా? లేదా? అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదని తహసీల్దార్​ తెలిపారు.