
- స్వర్ణ పోరుకు ముందు వెయిట్ టెస్టులో ఫెయిల్
- నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉండటంతో అనర్హత
- వేటును సవాల్ చేసినా దక్కని ఊరట
- అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఫొగాట్
పారిస్: ఒలింపిక్స్లో ఇండియాకు ఖాయమైన నాలుగో పతకం గంటల వ్యవధిలోనే వెనక్కివెళ్లిపోయింది. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వర్ణ కల చెదిరింది. అత్యద్భుత ఆటతో ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన దేశ తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించి.. ఆకాశమంత ఎత్తుకు వెళ్లిన వినేశ్ అంతలోనే అగాథంలోకి పడిపోయింది. బుధవారం జరిగే 50 కేజీల ఫైనల్ పోరుకు ముందు నిర్వహించిన పరీక్షలో నిర్ణీత (50 కేజీల) బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా ఫొగాట్ ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటుకు గురైంది.
దాంతో రూల్స్ ప్రకారం ఫైనల్ నుంచి వినేశ్ను తప్పించి ఆమెకు చివరి స్థానం కేటాయించారు. ఈ నిర్ణయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ), రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధికారులు సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. దాంతో ఫైనల్లో ఓడినా కనీసం రజతం అయినా తెస్తుందని ఆశించిన ఇండియా రెజ్లింగ్ క్వీన్.. ఒట్టి చేతులతో తిరిగొస్తోంది. తనకిదే చివరి ఒలింపిక్స్ అని చెప్పిన 29 ఏండ్ల వినేశ్ ఫొగాట్ ఆహారం, నీళ్లు తీసుకోకుండా బరువు తగ్గించే ప్రయత్నంలో డీహైడ్రేషన్కు గురై ఒలింపిక్ విలేజ్లో ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉంది.
అసలేం జరిగింది?
వినేశ్ ఈ ఒలింపిక్స్లో 50 కేజీ వెయిట్ కేటగిరీలో పోటీ పడుతోంది. పారిస్లో రెజ్లింగ్ పోటీలు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తొలి రోజు వైద్య పరీక్షలతో పాటు రెజ్లర్ల బరువు కొలుస్తారు. రెండో రోజు పతక పోటీలకు అర్హత సాధించిన వారికి మరోసారి బరువు కొలుస్తారు. ఇందులో రెజ్లర్లు తాము అనుమతించిన బరువులోపు ఉన్నట్టు నిరూపించుకుంటేనే పోటీకి అనుమతిస్తారు. మంగళవారం ఉదయం వినేశ్ 49.90 కేజీల బరువుతో అనుమతించదగిన పరిమితిలోపు ఉంది. కానీ, సాయంత్రం సెషన్లో వరుసగా మూడు బౌట్లలో పోటీ పడింది.
ఈ క్రమంలో ఎనర్జీని కాపాడుకోవడం కోసం కొద్దిగా నీళ్లు, ఆహారం తీసుకుంది. ఈ కారణంగా సెమీఫైనల్ ముగిసిన తర్వాత ఆమె బరువు 52.7 కేజీలకు చేరుకుంది. దాంతో, రాత్రంతా నిద్రపోకుండా స్వెట్ సూట్ వేసుకొని వర్కౌట్స్ చేస్తూ బరువు తగ్గించే పనిలో పడింది. చుక్క నీరు, తిండి లేకుండా స్కిప్పింగ్, ఇతర కసరత్తులు చేసింది. శరీరంలోని నీటిని తగ్గించేందుకు ఆవిరి స్నానం కూడా చేసింది. చివరి ప్రయత్నంగా కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ వినేశ్ జుట్టును కత్తిరించారు.
కానీ, ఇవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఉదయం బరువు కొలవగా 50 కేజీల పరిమితి కంటే 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. నిర్వాహకులు 30 నిమిషాల సమయం ఇచ్చినా ఆలోపు వంద గ్రాములను వినేశ్ తగ్గించుకోలేకపోయింది. అనర్హత వేటు నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డబ్ల్యూఎఫ్ఐ.. ఇంటర్నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ను అప్పీల్ చేసినా.. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో ఐవోఏ అధికారులు చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు.
ఒలింపిక్స్, వరల్డ్, ఆసియా చాంపియన్షిప్స్ వంటి మెగా టోర్నీల్లో రెజ్లర్లు తాము ఎంచుకున్న వెయిట్ కేటగిరీ కంటే ఒక్క గ్రాము బరువు ఎక్కువ ఉన్నా కూడా పోటీకి అనుమతించరు. వారి ఫలితాలను రద్దు చేసి పోటీలో చివరి స్థానంలో ఉంచుతారు. ‘రెండో రోజు వే ఇన్లో వినేశ్ విఫలమైంది.
ఇంటర్నేషనల్ రెజ్లింగ్ రూల్స్లోని ఆర్టికల్ 11 ప్రకారం సెమీస్లో ఓడిన క్యూబా బాక్సర్ గుజ్మన్ లోపేజ్ వినేశ్ స్థానంలో ఫైనల్లో పోటీ పడుతుంది ’ అని పారిస్ గేమ్స్ నిర్వాహకులు ప్రకటించారు. కాగా, 50 కేజీ వెయిట్ కేటగిరీలోనే అధిక బరువు కారణంగా మంగళవారం ఇటలీకి చెందిన ఇమాన్యులా లియుజ్జీపై కూడా
అనర్హత వేటు పడింది.
రజతం ఇవ్వాలని కోరలేదా?
వినేశ్కు రజత పతకాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ ఐఓసీకి లేఖ రాశారు. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ జోర్డాన్ బరోస్ (అమెరికా) తనకు పతకం ఇవ్వాలని అధికారులను కోరాడు. ఇందుకు ఒప్పుకోని అధికారులు తమ నిబంధనల ప్రకారం సెమీ-ఫైనలిస్ట్ లోపెజ్ను ఫైనల్కు నామినేట్ చేశారు.
పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో మన మల్ల యోధురాలు వినేశ్ ఫొగట్ సివంగిలా దూకి... ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టి కరిపించి.. ఫైనల్కు దూసుకెళ్తే ఎంత ఆనందమో..! విశ్వ క్రీడల రెజ్లింగ్లో పసిడి పతక పోరుకు చేరిన దేశ తొలి మహిళగా చరిత్రకెక్కినందుకు ఎంత సంతోషమో..! వినేశ్ కసి, ‘పట్టు’దల చూస్తుంటే ఫైనల్లోనూ గెలిచి స్వర్ణ పతకం అందుకున్న దేశ తొలి మహిళ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంటే.. విశ్వవేదికపై మన త్రివర్ణం రెపరెపలాడుతుంటే చూసేందుకు సిద్ధమై ఉన్న కోట్లాది మంది అభిమానుల గుండె పగిలింది.
తన క్రీడా జీవితంలో అతి పెద్ద రోజున.. కలలో కూడా ఊహించని పరిణామం వినేశ్ ఫొగాట్కు అడ్డు తగిలింది. వంద గ్రాముల బరువు స్వర్ణ కలను కల్లలు చేసి తనకు గుండెకోతను మిగిల్చింది. 50 కేజీల విభాగంలో పోటీ పడుతున్న ఫొగాట్.. ఫైనల్ ముందు చేసిన బరువు పరీక్షలో వంద గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా అనర్హత వేటు ఎదుర్కొని ఫైనల్ బెర్తు కోల్పోయింది. నిబంధనల ప్రకారం తన పోటీలో ఆఖరి స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.
పెరిగిన బరువు తగ్గించుకునేందుకు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చుక్క నీరైనా తాగకుండా కసరత్తులు చేసినా.. చివరకు జుట్టును కత్తిరించుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో ఫైనల్లో ఓడినా కనీసం రజతం తెస్తుందని ఆశించిన ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరి గింది. మొత్తంగా వినేశ్ విజయ గాథ కొన్ని గంటల్లోనే విషా దంగా మారిపోయింది. దేశ ఒలింపిక్ చరిత్రలో మొదటిదైన ఈ సంఘటనతో సగటు అభిమాని గుండె బరువెక్కింది.
తొలిసారి కాదు..
బరువు కారణంగా డిస్క్వాలిఫై వినేశ్కు ఇదే తొలిసారి కాదు. 2016 రియో గేమ్స్కు ముందు జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో 400 గ్రాములు ఎక్కువ బరువు
ఉన్నందుకు వేటు ఎదుర్కొన్నది.
గాయం అయిందని తప్పుకుంటే పతకం వచ్చేదా?
గాయం అయిందంటూ వినేశ్ ఫైనల్ బౌట్ నుంచి తప్పుకుంటే తనకు రజతం లభించేదన్న ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందుకు అనుమతి లేదు. తను తొలి రోజు పోటీల్లో గాయపడితేనే రెండో రోజు బరువు పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా పోటీ తర్వాత రెజ్లర్కు గాయం అయినా.. అనారోగ్యానికి గురైనా బరువు కొలిచిన తర్వాతే వాకోవర్కు అనుమతి ఇస్తారు.
చాంపియన్ బలంగా తిరిగి రా: మోదీ
వినేశ్ అనర్హత విషయం తెలిసిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషతో ఫోన్లో మాట్లాడారు. ఫోగాట్ కేసులో సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, ఆమెపై అనర్హత వేటుపై తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని ఉషకు సూచించారు. ఇక, ఈ ఎదురుదెబ్బ నుంచి కోలుకొని వినేశ్ బలంగా తిరిగి రావాలని మోదీ ఆకాంక్షించారు. ‘వినేశ్ నువ్వు చాంపియన్లలో చాంపియన్.! దేశానికి గర్వకారణం. . ఈ ఎదురుదెబ్బ చాలా బాధిస్తుంది . కానీ, సవాళ్లను ఎదిరించడం నీ నైజం. కాబట్టి ఈ బాధ నుంచి బయటపడి బలంగా తిరిగి రా! మేమంతా నీతోనే ఉన్నాం’ అని మోదీ ట్వీట్ చేశారు.
షాక్ అయ్యాను
ఒలింపిక్ విలేజ్ పాలిక్లినిక్లో వినేశ్తో మాట్లాడాను. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అన్ని టెస్టుల రిపోర్టులు బాగానే ఉన్నాయి. ఐవోఏ, కేంద్ర ప్రభుత్వం, దేశం మొత్తం తనకు అండగా ఉందని వినేశ్కు భరోసా ఇచ్చాను. తనకు అవసరమైన హెల్త్, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నాం. ఏదేమైనా వినేశ్పై అనర్హత వేటు పడటంతో నేను షాక్ అయ్యా. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించమని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూడబ్ల్యూడబ్ల్యూకి అప్పీల్ చేసింది. ఐవోఏ కూడా అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేసింది.
- ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష