
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు తియ్యని ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు. కీసర, మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట్, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, ఫరూక్నగర్ తోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, తూప్రాన్ మండలాల్లోని సుమారు 5 వేల ఎకరాలకు పైగా ద్రాక్షతోటలు ఉండేవి.
ప్రత్యేకించి ములుగు, గజ్వేల్, తూప్రాన్ల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల వరకూ సాగయ్యేవి. ఈ తోటలు ఉండడాన్ని కొందరు బడా రైతులు హోదాగా భావించేవారు. వందల ఎకరాల్లో ద్రాక్ష తోటలు పెంచి, జాతీయస్థాయిలో పురస్కారాలు అందుకున్నవారు కూడా ఉన్నారు. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యాపారులు, వంటిమామిడి, తునికి బొల్లారం, తునికి ఖల్స, తుర్కపల్లి తదితర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, కౌలుకు తీసుకొని ద్రాక్ష తోటలను వేసేవారు.
ALSO READ | Health tips: కాలేయం సమస్యలున్నాయా..చెరుకు రసంతో మంచి ఫలితాలు
తాజ్-ఏ- గణేష్, బ్లాక్, థామ్సన్ సీడ్లెస్ రకాలను ఎక్కువగా సాగుచేసేవారు.18 మిల్లీమీటర్ల సైజులో పండిన ద్రాక్షను మన అవసరాలకు పోగా కర్నాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైంది. కేవలం మేడ్చల్, కీసర, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఇప్పుడు సుమారు 200 ఎకరాలకే ఈ పంట పరిమితమైంది.