Virat Kohli: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. సచిన్ మరో ఆల్‌టైం రికార్డుకు చేరువలో కోహ్లీ

Virat Kohli: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. సచిన్ మరో ఆల్‌టైం రికార్డుకు చేరువలో కోహ్లీ

టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ  వరల్డ్ క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు. సచిన్ రికార్డులను ఒకొక్కటిగా బద్దలు కొడుతూ వస్తున్న విరాట్ తాజాగా మరో ఆల్ టైం రికార్డ్ పై కన్నేశాడు. వన్డేల్లో ఇప్పటికే 50 సెంచరీలు చేసి సచిన్ సెంచరీల రికార్డును దాటేసిన కోహ్లీ.. ఇప్పుడు పరుగుల విషయంలో మరో అల్ టైం రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో గురువారం (ఫిబ్రవరి 6) జరగనున్న వన్డే సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. 

ఈ రికార్డ్ ఇప్పటివరకు టీమిండియా దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 2006 ఫిబ్రవరిలో పెషావర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన 350వ ఇన్నింగ్స్‌లో 14,000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర మార్చి (2015లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో) 378 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 13,906 పరుగులు సాధించాడు. కోహ్లీ మరో 66 ఇన్నింగ్స్ ల్లో 94 పరుగులు చేసినా రికార్డ్ బ్రేక్ అవుతుంది. అయితే అభిమానులు మాత్రం ఈ సిరీస్ లోనే ఈ రికార్డ్ బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. 

ALSO READ | Tri-Series: పాకిస్తాన్‌లో ట్రై-సిరీస్.. షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు

36 ఏళ్ళ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ లో సత్తా చాటి ఫామ్ లోకి రావాలని జట్టు యాజమాన్యంతో పాటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 6న (గురువారం) నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది. రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుండగా, మూడో మరియు చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. 2024 లో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు.