విశాఖ సెంట్రల్​ జైలును సందర్శించిన హోం మంత్రి అనిత

విశాఖ సెంట్రల్​ జైలును సందర్శించిన హోం మంత్రి అనిత

విశాఖ సెంట్రల్​ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. గంజాయి కేసుల్లో అమాయకులైన గిరిజనులు ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్నారని.. అసలైన దోషులు తప్పించు తిరుగుతున్నారని .. ఈ విషయంలో అధ్యయనం చేసి ..అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయం చేస్తామన్నారు.గంజాయిని అరికట్టేందుకే మంత్రుల సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు.    ప్రాణిహిత బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఎనీ టైం క్లినిక్ (ఏటీసీ)ని  ప్రారంభించారు.  ఖైదీలు ఆరోగ్య ప‌రీక్షల‌కు బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి త‌ప్పుతుంద‌ని, 17 ర‌కాల సేవ‌లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. మానసిక వైద్యుల‌ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని పేర్కొన్నారు. శ్రామికవ‌నంలో ఖైదీలు త‌యారు చేస్తున్న వివిధ వ‌స్తుల‌ను ప‌రిశీలించారు. లోపల అనేక వస్తువులు తయారు చేస్తున్నారని.. వాటిని అమ్మకాలు చేసేందుకు కూడా తాము ఆలోచన చేస్తామని చెప్పారు. 

పోలీసులు పని చేయడానికి సరైన వసతులు లేవని.. మహిళ పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. పోలీస్ వెహికల్ ముందు వెళ్తుంటే... వెనుక ఉన్న వారు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. లోపల పరిస్థితులు చూస్తే హృదయ విధారకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.క్షమాభిక్షులకు కూడా ఐదేళ్ల నుంచి నిలిపివేశారన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈరోజు జైల్లో పర్యటించామన్నారు. కనీసం బెయిల్ మంజూరు చేసుకోలేక అనేక మంది జైల్లో మగ్గుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.