
లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూరు ప్రాంతానికి చుక్క నీరు రాలేదని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడి గట్టు, అదిల్ పేట, పొన్నారం, వెంకటాపుర్, సారంగపల్లి, చిర్రకుంట, శంకర్ పల్లి, సండ్రన్ పల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీర్ అవతారమెత్తి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్.. చెన్నూరు ప్రాంతానికి తాగు, సాగు నీరు ఇవ్వలేదు కానీ, ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో వేల ఎకరాల పొలాలు నీట మునగడానికి కారకుడయ్యారని మండిపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించలేదని, కనీసం వారిని పరామర్శించే సోయి కూడా అతనికి లేదన్నారు. కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు కేసీఆర్ దోచుకుంటే.. ఇసుక దందాలో బాల్క సుమన్ రూ.వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఆయనకు ప్రజా సేవ కంటే ఇసుక దందానే ముఖ్యమని విమర్శించారు.
రూ.60 వేల కోట్ల మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. రూ.6 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని ఫైర్ అయ్యారు. ఇంతలా అప్పులు చేసినా చెన్నూరు ప్రాంతానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. అవినీతిలో మునిగిపోయిన సీఎంని ఇంటికి పంపించే సమయం వచ్చిందన్నారు. సింగరేణి సొమ్మునంత కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టి, వృథా చేశారనన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకోవడానికి ప్రాజెక్ట్ను రీ డిజైన్ చేశారని మండిపడ్డారు. మరోవైపు, కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చారని ఆరోపించారు. ఈవీఎంలో నాలుగో నంబర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి, గెలిపించాలని కోరారు.
రెండు జతల బట్టలున్న వాడికి, వేల కోట్లు ఎక్కడివి?
తన సూట్ కేసులో రెండు జతల బట్టలు ఉన్నాయని చెన్నూరుకు వచ్చినప్పుడు చెప్పిన బాల్క సుమన్.. మరి ఇప్పుడు ఆ సూట్ కేసులో రూ.వెయ్యి కోట్లు ఎలా వచ్చాయని వివేక్ ప్రశ్నించారు. గ్రామాలకు వచ్చి, వారి సమస్యలను బాల్క సుమన్ ఎప్పుడూ విన్నది లేదన్నారు. బానిస సుమన్ కేసీఆర్ ఇంట్లోనే ఉంటే, ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. రూ.వెయ్యి కోట్లతో నియోజవర్గాన్ని అభివృద్ధి చేశానని బాల్క సుమన్ చెబుతుంటే, ఎక్కడా డెవలప్ చేయలేదని ప్రజలు చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోరంబోకు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చెన్నూరులో మొదట అనుబంధ పరిశ్రమల ఏర్పాటు చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డు విలువ రూ.22 లక్షలని, ఆ పార్టీతోనే ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు.
కేసీఆర్కు బుద్ధి చెప్పాలి..
నాసిరకం ప్రాజెక్టులు కడుతూ రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్న సీఎం కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలని వివేక్ వెంకట స్వామి పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్లో, లేదంటే ఫామ్ హౌస్లో మందు తాగి పడుకుంటారని విమర్శించారు. పోడు భూముల సమస్యపై కేసీఆర్ రెండు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఓటుతోనే కేసీఆర్ను దెబ్బకొట్టాలని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలుత పోడు భూముల సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో 600 బోర్ వెల్స్ వేయించానని.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇక్కడి పాలవ వాగు వంతెన పరిస్థితిపై బాల్క సుమన్ను అడుగుదామంటే ఆయన ఎప్పుడూ ప్రజలను కలవడని ఎద్దేవా చేశారు.