కాంగ్రెస్​ సర్కారుతోనే ప్రజలకు స్వేచ్ఛ : వివేక్​ వెంకటస్వామి

కాంగ్రెస్​ సర్కారుతోనే ప్రజలకు స్వేచ్ఛ :  వివేక్​ వెంకటస్వామి
  • ప్రతి పంచాయతీకి రూ.5 లక్షల నిధులు
  • క్యాతనపల్లి మున్సిపల్​ వార్డుల్లో ఆకస్మిక పర్యటన

కోల్​బెల్ట్​/జైపూర్/చెన్నూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, వారు  కలలుగన్న తెలంగాణను సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలో సాధించబోతున్నామని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం 75వ రిపబ్లిక్​ డే వేడుకల్లో భాగంగా జైపూర్​ మండల కేంద్రం ముదిగుంట గ్రామంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.

విద్యార్థులకు నోట్​బుక్​లు, పెన్నులు అందజేశారు. అనంతరం మిట్టపెల్లి గ్రామంలో ఎడ్ల పందాలను ప్రారంభించారు. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో జరిగిన కాకా వెంకటస్వామి-కళావతి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్​లు అందించారు. కొత్తగా చెన్నూరు–హైదరాబాద్​ మార్గంలో నడవనున్న ఏసీ సెమీ స్లీపర్ ​లహరి బస్సును చెన్నూర్​ బస్టాండ్​లో ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో పదేండ్లుగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక మథనపడ్డారని అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి న్యాయకత్వంలో తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నట్లు చెప్పారు.

ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామన్నారు. బీఆర్​ఎస్​ సర్కార్ రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్​ భగీరథలో లోపాలున్నాయని, పనులు పూర్తికాక ఇంటింటికీ నీళ్లు రావడంలేదన్నారు. లోపాలపై ఎంక్వయిరీ చేయాలని సీఎం రేవంత్​రెడ్డికి కోరానని, సమస్యల పరిష్కారానికి స్పెషల్​గా రూ.10 కోట్ల ఫండ్స్​ను ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. నెల రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు నీళ్లు వచ్చేలా చూస్తామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున ఫండ్స్​ కేటాయిస్తానని పేర్కొన్నారు. 

రైల్వే ఫ్లైఓవర్ పనులు స్పీడ్​చేయాలె

రామకృష్ణాపూర్ -మంచిర్యాల ప్రధాన రహదారిలోని క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్​బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మరిన్ని మెషీన్లు, మ్యాన్​పవర్​ను నియమించి పనులను స్పీడప్​ చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, ఆఫీసర్లను ఆదేశించారు. అంతకు ముందు మార్నింగ్​వాక్​లో గద్దెరాగడి, సాయి కుటీర్, బి-జోన్​ సెంటర్ చౌరస్తాలో పర్యటించారు. గత ప్రభుత్వాలు డ్రైయినేజీలు నిర్మించకపోవడంతో మురికి నీరంతా రోడ్లపై నిలిచి నడవలేకపోతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

రామకృష్ణాపూర్​కు చెందిన కాంగ్రెస్​ కార్యకర్తలు తాడికొండ రంగాచారి, బోయిన రవికుమార్, చెన్నూరు మండలం కత్తరశాల, సుందరశాల గ్రామాలకు చెందిన చిన్న రాజమల్లు, పోటు పద్మ  ఇటీవల చనిపోగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే వివేక్​పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో క్యాతనపల్లి, రామకృష్ణాపూర్, జైపూర్, చెన్నూరు కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.