
వెలుగు, చెన్నూర్: చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి.వివేక్ వెంకట స్వామి 20 రోజులుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 6న జైపూర్ మండలం ఇందారం నుంచి ఆయన క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఇందారం నుంచి చెన్నూర్ వరకు 25 కిలోమీటర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోజూ పొద్దున ఆరు గంటలకు మార్నింగ్ వాక్ తో స్టార్ట్ చేసి రాత్రి పదింటి దాకా విరామం లేకుండా పల్లెల్లో పర్యటిస్తున్నారు. ఏ ఊరికి వెళ్లినా ఆయనకు ప్రజలు డప్పుచప్పుళ్లు, గజమాలలు, మంగళహారతులతో స్వాగతం పలికి విజయ తిలకం దిద్దుతున్నారు.
వివేక్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. వివేక్ తన ప్రచారంలో సింగరేణి కార్మికులు, యూత్ పైన ఫోకస్ చేస్తున్నారు. బాల్క సుమన్ ల్యాండ్, సాండ్, కోల్ దందాలతో రూ.వెయ్యి కోట్లకు పైగా సంపాదించాడంటూ 30 పర్సెంట్ కమీషన్ గవర్నమెంట్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.
డబుల్ బెడ్రూంలు, దళితులకు మూడెకరాల భూమి, దళితబంధులో కమీషన్లు, నిరుద్యోగ భృతి, రేషన్ కార్డులు, 57 ఏండ్లకే పింఛన్లు, మిషన్ భగీరథ తదితర స్కీముల్లో వైఫల్యాలను వివరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ బాధితులకు భరోసా ఇస్తున్నారు. సుమన్ ఒంటెత్తు పోకడలు, అనుచరుల ఆగడాలు, ప్రశ్నించిన వారిపై కేసులు, దాడుల గురించి నిలదీస్తున్నారు. బైబై బాల్క సుమన్ , బైబై కేసీఆర్ అంటూ జనంతోనే పలికిస్తున్నారు.