గ్రాడ్యుయేట్‌‌‌‌, టీచర్స్‌‌‌‌.. ఓటు నమోదు స్టార్ట్‌‌‌‌

గ్రాడ్యుయేట్‌‌‌‌, టీచర్స్‌‌‌‌..  ఓటు నమోదు స్టార్ట్‌‌‌‌
  •  ఆర్డీవో, తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లలో ప్రత్యేక కౌంటర్లు
  • ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనూ అప్లై చేసుకునే అవకాశం
  • వచ్చే నెల 6 వరకు గడువు
  •  ఇప్పటివరకు 78,936 మంది గ్రాడ్యుయేట్స్‌‌‌‌ నమోదు
  •  ఓటు నమోదుపై టీచర్స్‌‌‌‌ యూనియన్ల స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌

మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు : ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌, టీచర్స్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి, టీచర్స్‌‌‌‌ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియను స్టార్ట్‌‌‌‌ చేశారు. ఆయా జిల్లాల పరిధిలోని ఆర్డీవో, తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లలో ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో చాలా మంది పట్టభద్రులు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ సారి అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అటు ఆఫీసర్లు, ఇటు ఆశావహులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

వచ్చే నెల 6 వరకు గడువు

2021 నవంబర్‌‌‌‌ వరకు డిగ్రీ పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్‌‌‌‌ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు. ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు డిగ్రీ మెమో, ప్రొవిజినల్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌, ఆధార్‌‌‌‌, ఓటర్‌‌‌‌ ఐడీ కార్డు, ఈ మెయిల్‌‌‌‌ ఐడీ, ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌, పాస్‌‌‌‌ పోర్ట్‌‌‌‌ సైజ్‌‌‌‌ ఫొటో అవసరం అవుతాయి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో నవంబర్ 6వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 23న డ్రాఫ్ట్‌‌‌‌ ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ ప్రచురించాలని, ఈ లిస్ట్‌‌‌‌పై డిసెంబర్‌‌‌‌ 9 లోపు అభ్యంతరాలు స్వీకరించి వాటిని 25 లోపు పరిష్కరించనున్నారు. డిసెంబర్‌‌‌‌ 30న ఫైనల్‌‌‌‌ ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ ప్రకటించేందుకు నిర్ణయించారు.

ఇప్పటివరకు 78,936 మంది గ్రాడ్యుయేట్లు..

ఓటు నమోదు విషయంలో గ్రాడ్యుయేట్ల నుంచి స్పందన బాగానే వస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌‌‌‌ జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 78,936 మంది గ్రాడ్యుయేట్స్‌‌‌‌ అప్లై చేసుకున్నారు. ఇందులో 78,788 మంది ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోగా, కేవలం 148 మందే ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లికేషన్లు అందజేశారు. గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న కరీంనగర్‌‌‌‌కు చెందిన ఓ విద్యావేత్త అన్ని జిల్లాల్లో ఆఫీస్‌‌‌‌లు ఓపెన్‌‌‌‌ చేసి, సిబ్బందిని నియమించి గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు.

టీచర్‌‌‌‌ యూనియన్లపై ఫోకస్‌‌‌‌

టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదుపై టీచర్స్‌‌‌‌ యూనియన్స్‌‌‌‌ ప్రత్యేక దృష్టి సారించాయి. హైస్కూల్‌‌‌‌లో పనిచేసే హెచ్‌‌‌‌ఎంలు, స్కూల్‌‌‌‌ అసిస్టెంట్లు, పీఈటీలు, లాంగ్వేజ్‌‌‌‌ పండిట్స్‌‌‌‌, కేజీబీవీ, మోడల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ టీటర్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. దీంతో టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వీలైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు టీచర్స్‌‌‌‌ యూనియన్లు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆశావహులు ఎక్కువగా మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా ఓటరు నమోదుపై దృష్టి సారించారు. 

స్కూల్‌‌‌‌లు, కాలేజీలకు వెళ్లి ఓటు నమోదు చేసుకోవాలని సూచించడమే కాకుండా, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఎలా నమోదు చేసుకోవాలన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురు క్యాండిడేట్లు ప్రైవేట్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌కు వెళ్లి టీచర్లకు మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా ఓటు నమోదు గురించి తెలియజేయడంతో పాటు, ఓటరు ఫారం, ఏఏ సర్టిఫికెట్లు అటాచ్‌‌‌‌ చేయాలో వివరిస్తున్నారు. గ్రాడ్యుయేట్లు, టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దిపేట జిల్లా నుంచి చాలా మంది క్యాండిడేట్లు సన్నద్ధం అవుతుండడమే కాకుండా, ఇప్పటికే అవగాహన సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మందిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రత్యేకంగా సిబ్బంది నియమించి మానిటరింగ్ చేస్తున్నారు.