
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఈ ఉదయం ఓటేశారు. లెక్ సభ నియోజకవర్గం పరిధిలోని నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో తన భర్త అనిల్ కుమార్, అత్త, మామలతో కలిసి ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత క్యూలైన్లో నిల్చొని తన వంతు వచ్చినప్పుడు ఓటేశారు.
ఎంపీ కవిత ఓటు వేసి తిరిగి వెళ్తున్న సందర్భంలో క్యూలైన్ లోని ఓ మహిళ ఆమెకు తన గోడు వినిపించారు. ఆమె చెబుతున్నది విన్న కవిత… త్వరలోనే అన్నీ పరిష్కారమవుతాయంటూ ఆమెను సముదాయించారు. పక్కనున్న మిగతా మహిళలు కూడా తమ బాధలు చెప్పుకున్నారు. అందరూ ఒక్కసారిగా తమ సమస్యలు కవితకు వివరిస్తూ.. ఇంకెప్పుడు పరిష్కరిస్తారని గట్టిగా నిలదీశారు. గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో.. అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ… కవిత , పార్టీ నాయకులతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయారు.