
భద్రాచలం,వెలుగు : శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం రాత్రి ఊంజల్సేవ వైభవంగా నిర్వహించారు. నిత్య కల్యాణ మండపంలో ప్రత్యేకంగా ఊయలను ఏర్పాటు చేసి ఆవాహన చేశారు. అనంతరం స్వామివారిని ఊయలలో ఆసీనులను చేసి భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలను దేవస్థానం హరిదాసులు ఆలపించారు. వేదవిన్నపాల అనంతరం జరిగిన లాలలు, జోలలు వేదోక్తంగా సాగాయి. ఇదే సమయంలో దేవతామూర్తులకు ప్రత్యేక హారతులు అందించారు. అనంతరం స్వామికి సింహవాహన సేవను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.