
వనపర్తి, వెలుగుః వరి కోతలు ప్రారంభమైన దృష్ట్యా అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, టర్పాలిన్ లు, గన్నీ బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే మిషన్లు లేదా ఫ్యాన్ లు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. కోపరేటివ్ అధికారి, డీఆర్డీఓ, వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారి కొనుగోలు కేంద్రాలను సందర్శించి కనీస సదుపాయాలు ఉన్నాయా లేవా చూసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో దాదాపు 462 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో ఆత్మకూరు, కొత్తకోట, అమరచింత, మదనపూర్ లొ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యాసంగిలో వనపర్తి జిల్లాలో 148, 596 ఎకరాల్లో వరి సాగు చేయగా 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామన్నారు. సమావేశంలో ఏడీసీ వెంకటేశ్వర్లు, డీఎస్వో విశ్వనాథ్, డీఏవో గోవింద నాయక్, పీడీ డీఆర్డీఓ ఉమాదేవి, డీఎంవో స్వరణ్ సింగ్, కోపరేటివ్ అధికారి బి. రాణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 30 ఫిర్యాదులు వచ్చాయి.