భీంగల్​లో ఉద్రిక్తత: మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే  ప్రశాంత్​రెడ్డి మధ్య మాటల యుద్ధం 

భీంగల్​లో ఉద్రిక్తత: మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే  ప్రశాంత్​రెడ్డి మధ్య మాటల యుద్ధం 
  • కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు 
  • పోలీసులు లారీచార్జ్ .. నిరసనగా ఎమ్మెల్యే బైఠాయింపు  

బాల్కొండ/ నిజామాబాద్​,వెలుగు: నిజామాబాద్​జిల్లా భీంగల్​లో బుధవారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి జూపల్లి కృష్ణారావు, బాల్కొండ బీఆర్ఎస్​ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాళేశ్వరం 21,21ఏ ప్యాకేజ్ పనులు, లిఫ్టు ఇరిగేషన్ పూర్తి చేయాలని, ఎస్సారెస్పీ రిజర్వాయర్ ను టూరిజం కింద డెవలప్​చేయాలని కోరారు. 

చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్​సర్కార్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.6 వేల కోట్లు అసలు, వడ్డీ కడుతున్నామని పేర్కొన్నారు. అయినా స్కీమ్​లు కొన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.  రికార్డ్​స్థాయి అప్పులు చేసి కూడా గత సర్కార్​పేదలకు డబుల్​ఇండ్లు ఇవ్వలేదని  ఆయన విమర్శించారు. దీంతో మంత్రి వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకు తనకు మైక్​ ఇవ్వాలని ప్రశాంత్​రెడ్డి కోరారు. 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్​లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. నిరసిస్తూ వేముల ప్రశాంత్​రెడ్డి భీంగల్​మెయిన్​రోడ్​పై బైఠాయించారు. కాంగ్రెస్​ పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.