మూడు ఇండ్లు.. 16 ఓపెన్ ప్లాట్లు.. 15 ఎకరాల పొలం.. హన్మకొండలో ఈ గవర్నమెంట్ ఆఫీసర్ పోగేసిన ఆస్తులివి..

మూడు ఇండ్లు.. 16 ఓపెన్ ప్లాట్లు.. 15 ఎకరాల పొలం.. హన్మకొండలో ఈ గవర్నమెంట్ ఆఫీసర్ పోగేసిన ఆస్తులివి..

హనుమకొండ, వెలుగు: ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్ల అవినీతికి అంతులేకుండా పోతోంది. ఆఫీసులను అడ్డాగా చేసుకుని కొందరు అధికారులు కరప్షన్కు పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడగడుతున్నారు. కొద్దిరోజుల కిందట మహబూబాబాద్​డీటీవో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కాగా, తాజాగా హన్మకొండ డీటీసీ(Deputy Transport Commissioner) పుప్పాల శ్రీనివాస్​కూడా పెద్ద మొత్తంలో ఆస్తులు పోగేసినట్లు ఏసీబీ సోదాల్లో తేలింది.

దీంతో రవాణా శాఖలో అలజడి మొదలవగా, మరికొందరు ఆఫీసర్లపైనా ఇవే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డిపార్ట్​మెంట్​కు చెందిన ఇద్దరు పెద్దాఫీసర్లు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవడంతో ఉమ్మడి జిల్లాలోని మరికొందరు కరప్టెడ్ ఆఫీసర్లలో గుబులు మొదలైంది.

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఆర్టీఏ ఆఫీసులు అవినీతికి అడ్డాగా మారాయి. కొంతమంది ఆఫీసర్లు ప్రైవేటు ఏజెంట్లను నియమించుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. వెహికల్ ఫిట్నెస్​ టెస్టుల నుంచి మొదలు లర్నింగ్ లైసెన్స్, రిన్యూవల్స్, బండ్ల రిజిస్ట్రేషన్, ఎక్స్​టెన్షన్.. ఇలా ఆఫీస్లో జరిగే ప్రతి పనికీ ఏజెంట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. తెర వెనుక ఆఫీసర్లే ఉండి నడిపిస్తుండటంతో కొంతమంది ఏజెంట్లు నకిలీ ఇన్సూరెన్స్​లు, ఫిట్​నెస్​ సర్టిఫికెట్ల దందాకు కూడా తెరలేపారు.

ఈ నేపథ్యంలోనే గతేడాది ఫిబ్రవరి 9న వరంగల్, హనుమకొండ ఆర్టీఏ ఆఫీస్​ల వద్ద ఫేక్ ​ఫిట్​నెస్ ​సర్టిఫికెట్ల దందాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వెనుక కూడా ఆర్టీఏ పెద్దాఫీసర్లే ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇలా ఆఫీస్​లో జరిగే ప్రతి పనికీ కమీషన్లు తీసుకోవడంతోపాటు పనిని బట్టి రేట్లు ఫిక్స్​చేస్తూ ఆఫీసర్లు అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్టీఏ డిపార్ట్మెంట్లో కొందరు ఆఫీసర్లు అక్రమంగా రూ.కోట్లు వెనకేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ పుప్పాల శ్రీనివాస్​ వ్యవహారంలోనూ ఇదే వెల్లడైంది. ఆయనపై ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరున మూడు ఇండ్లు, 16 ఓపెన్ ప్లాట్లు, 15.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ రూ.4 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ తెలిపింది. కానీ, బయట మార్కెట్​రేట్​ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.