వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద ఉద్రిక్తత

వరంగల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం(జనవరి 8) ఉదయం ఒక్కసారిగా రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యాపారులు ఒక్కసారిగా మిర్చి ధరలు సగానికి సగం తగ్గించారని ఆరోపిస్తూ.. రైతులు ధర్నాకు దిగారు.

మొన్నటి వరకు రూ. 25 వేలు పలికిన వండర్ హాట్ రకాన్ని రూ. 15వేలకే ఖరీదు చేశారని మండిపడ్డారు. 15 వేలు అమ్మే 1048, 5531 రకం మిర్చిని రూ.8 వేలకు, తేజా రకం రూ.20వేలు ఉండగా రూ.12 వేలకు ఖరీదు చేస్తున్నారంటూ రైతులు ధర్నా చేపట్టారు.  రైతులకు న్యాయం జరగాలంటూ రోడ్డుపై నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది.

రైతుల ఆందోళనతో ఎనుమాముల మార్కెట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మిర్చి ధర పెంచే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు డిమాండ్ చేశారు.