
హనుమకొండ, వెలుగు : చేసిన పనులకు 8 నెలలుగా బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెందిన వరంగల్ కాకతీయ యూనిర్సిటీ ఉద్యోగి చనిపోయాడు. వర్సిటీ ఆఫీసర్లను నమ్ముకుని పనులు చేయిస్తే, బిల్లులు ఆపి వేధించారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ డెడ్బాడీతో ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన కాలె మధుసూదన్(42) కేయూలో గ్రేడ్–4 ఉద్యోగి. జాబ్తోపాటు వర్సిటీలో టెండర్లు దక్కించుకుని కాంట్రాక్ట్ వర్క్స్ చేయిస్తుంటాడు. న్యాక్ A+ గ్రేడ్ కోసం.. వర్సిటీ అధికారులు రూ.30 లక్షల పనులకు టెండర్ వేయగా, మధుసూదన్ దక్కించుకున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్లో పనులు పూర్తిచేశాడు. అయితే బిల్లులు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు.
మొదట కొంత మొత్తాన్ని చెల్లించి .. తర్వాత పట్టించుకోలేదు. వాటి కోసం పలుమార్లు న్యాక్ పర్చేసర్ కమిటీ మెంబర్ల తోపాటు వర్సిటీ ఉన్నతాధికారులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం దెబ్బతినింది. ఈ నెల 2న పక్షవాతం రావడంతో ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అక్కడ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ లోని హాస్పిటల్కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.
డెడ్బాడీతో వీసీ బిల్డింగ్ ఎదుట ఆందోళన
వర్సిటీ అధికారులు సకాలంలో బిల్లులు రిలీజ్ చేయకపోవడంతోనే మధుసూదన్ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం డెడ్బాడీతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళనకు దిగారు. రాత్రి వరకు వీసీ బిల్డింగ్ఎదుట నిరసన తెలిపారు. కేయూ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, పోలీస్ అధికారులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో ఏసీపీ కేయూ వీసీ తాటికొండ రమేశ్కు ఫోన్ చేసి, మృతుడి భార్య కోమలతో మాట్లాడించారు. వీసీ హామీతో ఆందోళన విరమించారు.