ఓరుగల్లు మాస్టర్‍ ప్లాన్​ను  పదేండ్లుగా అప్రూవ్​ చేయట్లే!

ఓరుగల్లు మాస్టర్‍ ప్లాన్​ను  పదేండ్లుగా అప్రూవ్​ చేయట్లే!
  • వరంగల్ పర్యటనల్లోనూ ఊసెత్తని కేసీఆర్, కేటీఆర్.
  • ఏవైనా ఎన్నికల్లొస్తే అధికార పార్టీ లీడర్ల హడావిడి.
  • ప్లాన్ ​లేకుండానే అడ్డదిడ్డంగా రూ.వేల కోట్ల పనులు

వరంగల్, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో రాబోయే 40 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని 2013లో ‘మాస్టర్‍ ప్లాన్ 2041’ రెడీ చేయగా.. ప్రభుత్వం ఇప్పటివరకు గ్రీన్​సిగ్నల్​ఇవ్వలేదు. ఒక ప్లాన్​ప్రకారం బిజినెస్‍ కమర్షియల్‍ ఏరియాలు, పార్కులు, రెసిడెన్షియల్‍ జోన్ల ఆధారంగా సిటీని అభివృద్ధి చేయాల్సి ఉండగా.. వేల కోట్ల పనులకు లీడర్లు అడ్డదిడ్డంగా శంకుస్థాపనలు చేసి ప్రారంభిస్తున్నారు. ఏవైనా ఎన్నికలు వస్తున్నాయంటే ‘మాస్టర్ ప్లాన్‍’ టాపిక్‍ ముందుపెట్టి హడావుడి చేసి, తర్వాత లైట్‍ తీసుకుంటున్నారు. మున్సిపల్‍ మంత్రి కేటీఆర్‍ మూడేళ్ల కిందే ఫైల్‍కు ఓకే చెప్పినట్లు తెలిపినా.. సీఎం కేసీఆర్ టేబుల్​ మీదనే ఫైల్​ మూలుగుతోంది.

నేటికీ 1972 మాస్టర్ ప్లానే 

1971లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అధికారులు వరంగల్​అభివృద్ధి కోసం మాస్టర్‍ ప్లాన్‍ రూపొందించారు. 1972లో దాన్ని సవరించారు. ఆ టైంలో ప్రతి 20 ఏండ్లకు ఒకసారి కొత్త ప్లాన్ రెడీ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం 1991లో ఒకసారి, 2011లో మరోసారి ప్లాన్​మార్చుకోవాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. గ్రేటర్‍ వరంగల్‍ సిటీలో నేటికీ 1972 నాటి మాస్టర్ ప్లాన్‍ నే అమలు చేస్తున్నారు. ఈ పని చూడాల్సిన 1982లో ఏర్పడిన కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ(కుడా) పట్టించుకోవడం లేదు.

40 ఏండ్లు టార్గెట్​గా..

కుడా అధికారులు 40 ఏండ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2013లో కొత్త మాస్టర్‍ ప్లాన్‍ రూపొందించారు. తర్వాత ఎలక్షన్ల బిజీలో పడి పక్కనపెట్టారు. ఆపై 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్లాన్​లో పలు మార్పులు, చేర్పులు చేశారు. 2016లో వరంగల్ స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలకు ఎంపిక అవడంతో.. ‘లీ అసోసియేట్స్, కుడా ప్లానింగ్ విభాగం’ ఆధ్వర్యంలో మాస్టర్​ప్లాన్​లో మరోసారి మార్పులు చేశారు. కుడా పరిధిలోని ఏరియాలను 13 జోన్లుగా డివైడ్​చేశారు. 3 జిల్లాల పరిధిలోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాల్లో అప్పటి వరకు ఉన్న13 లక్షల జనాభా, 2041 నాటికి 30 లక్షల నుంచి 33 లక్షలకు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ ఇంతవరకు ప్లాన్‍ అమలు చేయలేదు. ఇప్పటికీ చాలా పనులను 1972 నాటి ప్లాన్​ప్రకారమే చేస్తున్నారు.  

2021లో మస్త్ హడావిడి 

2014లో బీఆర్ఎస్​పార్టీ మొదటిసారి అధికారంలోకి రాగా మాస్టర్‍ ప్లాన్‍ అమలుకు ఎప్పటికప్పుడు గడువు మార్చుకుంటూ వచ్చింది. 2018 డిసెంబర్‍లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ‘మాస్టర్‍ ప్లాన్ 2041’ విషయంలో మరోసారి హడావిడి చేసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరితో రెండు, మూడు సార్లు మీటింగ్‍ పెట్టి ప్లాన్ అమలుకు ఓకే చెప్పారు. 2020, మార్చి 11న మంత్రి కేటీఆర్.. ‘కుడా మాస్టర్ ప్లాన్ 2041’ అమలుకు గ్రీన్‍ సిగ్నల్ ఇచ్చారు. సీఎం ఆఫీస్‍ కు పంపి వదిలేశారు. 2021లో గ్రేటర్ వరంగల్‍ ఎన్నికల టైంలోనూ మాస్టర్ ప్లాన్‍ అమలుపై మంత్రి కేటీఆర్​మాటిచ్చారు. త్వరలోనే ఆమోదముద్ర వేసి వరంగల్‍ను ఫ్యూచర్‍ సిటీ చేస్తామని చెప్పారు. కానీ నేటికీ సీఎం కేసీఆర్‍ ఆమోదం తెలపలేదు. 

అడ్డదిడ్డంగా శంకుస్థాపనలు

2013 కొత్త మాస్టర్ ప్లాన్‍ ప్రకారం రెసిడెన్సియల్ జోAజ్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, గ్రోత్ కారిడార్లు, అగ్రికల్చర్, హెరిటేజ్ కన్జర్వేషన్.. ఇలా 11 జోన్లలో అభివృద్ధి చేయాల్సి ఉంది. పార్కులు, గార్డెన్లు, గ్రీన్ బఫర్స్, వాటర్ బాడీస్, ఫారెస్ట్, కెనాల్స్ అభివృద్ది చేయాలి. కానీ మున్సిపల్‍ మంత్రి కేటీఆరే వరంగల్‍ పర్యటనల్లో భాగంగా ఇష్టారీతిన చేపడుతున్న వేలాది కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. నెల, రెండు నెలలకోసారి ఉమ్మడి వరంగల్‍ జిల్లాకు వస్తున్న మంత్రి.. ఆడపదడపా వస్తున్న సీఎం కేసీఆర్‍ కనీసం మాస్టర్ ప్లాన్‍ అంశంపై చర్చించడంలేదు. గ్రేటర్ వరంగల్‍ నిర్మాణం ఓ ప్లాన్ ప్రకారం జరగడం లేదు.