- చిట్చాట్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీసీ మీటింగ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉందిగానీ, ఇతర కులాలను తిట్టే హక్కు లేదని అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. తీన్మార్ మల్లన్నకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని.. కానీ, కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రెడ్డీలు గుర్తుకు రాలేదా అని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. మల్లన్న గెలుపు కోసం తాను, తన కుటుంబంతోపాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అన్ని కులాల కాంగ్రెస్ నేతలు మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేల మీటింగ్కు సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తనకు ఫోన్ చేసింది నిజమేనని చెప్పారు. కానీ, ఆ మీటింగ్కు పోలేదని అన్నారు.