తూప్రాన్ మున్సిపల్ చైర్​పర్సన్​గా జ్యోతి

తూప్రాన్ మున్సిపల్ చైర్​పర్సన్​గా జ్యోతి

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లాతూప్రాన్ మున్సిపల్ చైర్​పర్సన్​గా 4 వార్డు  కౌన్సిలర్ మామిండ్ల జ్యోతి  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019  మున్సిపల్ ఎన్నికల్లో 1 వార్డు కు చెందిన బొంది రవీందర్ గౌడ్  మాజీ మంత్రి హరీశ్ రావు చొరవతో  మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కాగా వైస్ చైర్మన్ శ్రీనివాస్ తోపాటు కొంత మంది కౌన్సిలర్లకు చైర్మన్ రవీందర్ గౌడ్ తో సఖ్యత లేదు.

కొత్త గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గజ్వేల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి తూంకుంట నర్సారెడ్డి తో కలిసి వైస్ చైర్మన్ వర్గం సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి కాంగ్రెస్ లో చేరారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ పై ఈ నెల 6 న అవిశ్వాసం ప్రవేశ పెట్టి నెగ్గారు. ఈ విషయాన్ని ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు తెలపగా గురువారం కొత్త చైర్మన్ ఎన్నిక తేదీని ఖరారు చేశారు.

ఎక్స్ అఫీషియో మెంబర్ కూర రఘోత్తం రెడ్డి తో పాటు వైస్ చైర్మన్ శ్రీనివాస్ 9 మంది కౌన్సిలర్లతో కలిసి కొత్త చైర్మన్ ఎన్నికకు హాజరయ్యారు.  కౌన్సిలర్ భగవాన్ రెడ్డి మామిళ్ల జ్యోతిని చైర్మన్ గా ప్రతిపాదించాడు.16 వార్డు కౌన్సిలర్ నారాయణగుప్తా  జ్యోతిని బలపరిచడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో  నిర్ణయించారు. కార్యక్రమంలో కమిషనర్ ఖాజామోయిజోద్దిన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.