
- ఫిబ్రవరి నుంచే పెరిగిన ఎండలు
- మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో పడిపోతున్న నీటి మట్టం
- నిరుడుకంటే గ్రౌండ్ వాటర్ పెరిగినా అధిక వినియోగంతో కష్టాలు
- జూరాలకు ఒక టీఎంసీ నీటినే విడుదల చేసిన కర్నాటక ప్రభుత్వం
మహబూబ్నగర్, వెలుగు : ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాధారణంకంటే అధిక వర్షాలు రికార్డ్ అయ్యాయి. కానీ, సమ్మర్లో మాత్రం నీటి సమస్య తప్పేలా లేదు. మహారాష్ర్ట, కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టుల నిండి పెద్ద మొత్తంలో దిగువకు వరద వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఫుల్ కెపాసిటీకి చేరుకున్నాయి. వాటి కింద ఉన్న చెరువులు, కుంటలు నిండాయి. వీటి పరిధిలో ఉన్న బోర్లు రీచార్జ్ అయ్యాయి. కానీ నెలలు తిరక్క ముందే ప్రాజెక్టుల్లో నీళ్లు ఆవిరైపోతున్నాయి. జనవరి చివరిలోనే నీళ్లు అడుగంటిపోయాయి. దీనికితోడు ఏప్రిల్ టెంపరేచర్లు.. ఫిబ్రవరి నుంచే మొదలు కావడంతో నీటి నిల్వలు పడిపోతున్నాయి. తాగు, సాగునీటికి వినియోగం పెరగడంతో తాజాగా బోర్లు కూడా వట్టిపోతున్నాయి.
నాలుగు నెలల్లో నాలుగు మీటర్లకు పడిపోయాయి..
గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన లెక్కల ప్రకారం గతేడాది నవంబరు చివరి నాటికి మహబూబ్నగర్ జిల్లాలో 6.02 మీటర్ల లెవల్కు, నారాయణపేట జిల్లాలో 4.99 మీటర్ల లెవల్ వరకు నీరు చేరింది. దీంతో గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు రీచార్జ్ అయ్యాయి.
మహబూబ్నగర్ జిల్లాలోని రాజాపూర్, గుడిబండ, పెద్దరేవల్లి, గంగాపూర్, కోడ్గల్, శేరి వెంకటాపూర్, వెలుగోముల, పోమాల్, తీగలపల్లి, ఈద్గాన్పల్లి, అడ్డాకుల, కురుమూర్తి, దేవరకద్ర, మీనుగోనిపల్లి, సల్కార్పేట, వేపూర్, జడ్చర్ల, దమ్మాయిపల్లి, కౌకుంట్ల, ఏనుగొండ, కొత్తపల్లి, మిడ్జిల్.. నారాయణపేట జిల్లాలోని పస్పుల, లింగంపల్లి, కొల్పూర్, మక్తల్, కొల్లంపల్లి, కోటకొండ, పులిమామిడి, కోస్గి, అప్పిరెడ్డిపల్లి, చేగుంట, దామరగిద్ద, సర్జఖాన్పేట, మరికల్, మద్దూరు, అమ్లికుంట, ధన్వాడ, కొండాపూర్ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరిగాయి.
అయితే ఫిబ్రవరి వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. నెల రోజులకు ముందే ఎండలు దంచడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. నాలుగు నెలల్లో 3.20 మీటర్ల లోపలికి నీటి నిల్వలు పడిపోయాయి. నారాయణపేట జిల్లాలో 4.99 మీటర్ల లెవల్లో ఉన్న నీళ్లు నాలుగు నెలల్లో 7.59 మీటర్ల లెవల్కు పడిపోయాయి. దీని ప్రకారం ఈ జిల్లాలో 2.6 మీటర్ల లోతుకు నీటి నిల్వలు అడుగంటిపోయాయి.
ప్రాజెక్టుల కింద వారబంది..
గ్రౌండ్ వాటర్ పెరిగిందని ఈ యాసంగిలో రైతులు రెండు జిల్లాల్లో మూడు లక్షల ఎకరాల్లో వరి పంటలు వేశారు. అయితే వాతావరణంలో మార్పులు రావడంతో డిసెంబర్ నుంచే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతూ వచ్చాయి. దీంతో ఆఫీసర్లు వారబంది ప్రకటించారు. సాగునీటి కెనాల్స్కు నీటిని విడుదల చేయడం లేదు. దీంతో డిసెంబరు చివరి వారం నుంచి వరి పంటలను కాపాడుకోవడానికి రైతులు బోర్లను విపరీతంగా ఉపయోగించారు.
దీనికితోడు తాగునీటి అవసరాల కోసం ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్లు కొన్ని బోర్లను లీజుకు తీసుకొని.. వాటి పరిధిలోని గ్రామాలకు తాగునీటిని తరలిస్తున్నారు. దీంతో అత్యంత వేగంగా గ్రౌండ్ వాటర్ పడిపోయిందని గ్రౌండ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మార్చి, ఏప్రిల్, మే ఎండలు మరింత ముదిరితే.. ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
అడిగింది నాలుగు టీఎంసీలు..
ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కర్నాటక వెళ్లారు. ఆ రాష్ర్ట సీఎం సిద్దిరామయ్యను కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన నీటి వనరైన జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉందని.. నారాయణపూర్ డ్యామ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. ఆ రాష్ర్ట ఇరిగేషన్ శాఖ మంత్రి శివకుమార్ను కలిసి.. పరిస్థితిని వివరించారు. ఇందుకు స్పందించిన వారు నీటి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాని.. గత నెల 22న ఒక టీఎంసీ నీటిని మాత్రమే అక్కడి డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేశారు. ఆ నీరు జూరాలకు చేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. అయితే డిమాండ్ మేరకు నీటిని విడుదల చేస్తే ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు కొంత ఉపశమనం కలుగుతుంది.