
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 8న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నగరంలోని పలుచోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని వాటర్బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ వద్ద నేషనల్ హైవే అథారిటీ నిర్మించిన ఫ్లై ఓవర్ పనులకు ఆటంకం కలగకుండా జలమండలి పీఎస్సీ పైపులైన్ ను వేరే చోటికి మారుస్తోంది. ఈ పనుల్లో భాగంగా అక్కడ 1500 ఎంఎం డయా పైపులైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నారు.
దీంతో 12 గంటలపాటు ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తి శ్రీనగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేట ప్రాంతాల్లో కొన్నిచోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని, కొన్నిచోట్ల ప్రెజర్ తో నీటి సరఫరా అవుతుందన్నారు.