
- నిరుటితో పోలిస్తే ఈ మార్చి నాటికే 50 శాతం బుకింగ్స్ పెరుగుదల
- రోజుకు 12 వేల నుంచి 14 వేల ట్యాంకర్ల బుకింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. నల్లాల ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ఈ సంఖ్య ప్రతిరోజూ వేలల్లో ఉంటున్నది. ముఖ్యంగా వెస్ట్సిటీ వైపు అంటే.. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, ఐటీ కారిడార్, కోకాపేట, బోరబండ, ఎస్సార్నగర్, నిజాంపేట తదితర ప్రాంతాల్లో నిరుటి మాదిరిగానే ఈ సారి కూడా ఫిబ్రవరి నాటికే భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో జనాలు మెట్రోవాటర్బోర్డు వాటర్ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు.
టౌన్షిప్లు, గేటెడ్కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో ఉండేవారైతే పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. హైరైజ్ భవనాలుండే సమీప ప్రాంతాల కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. దీంతో వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ట్యాంకర్లు క్యూ కట్టాల్సి వస్తున్నది. నిరుడిలాగే వెస్ట్సిటీలోని ప్రాంతాల నుంచే ట్యాంకర్లకు ఎక్కువ డిమాండ్పెరిగిందని వాటర్బోర్డు అధికారులు చెబుతున్నారు.
2023–24 సంవత్సరం 28 నుంచి 32 శాతం డిమాండ్ పెరగ్గా, 2024–25 ఫిబ్రవరి నాటికి ఇది 40 నుంచి 42 శాతానికి చేరింది. ఇది రాను రాను మరింత ఎక్కువయ్యే అవకాశముందని అంటున్నారు. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్ను తట్టుకునేందుకు మెట్రోవాటర్బోర్డు అధికారులు పెద్ద సంఖ్యలో ఫిల్లింగ్పాయింట్లను పెంచినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఆయా పాయింట్ల వద్ద ట్యాంకర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది.
గతేడాది పరిస్థితులే పునరావృతం
నిరుడు వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రేటర్పరిధిలో నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నది. ట్యాంకర్ల డిమాండ్విషయానికి వస్తే గతేడాది ఫిబ్రవరి నెలలో1,12,926 ట్యాంకర్లను మెట్రోవాటర్బోర్డు అధికారులు సరఫరా చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో లక్షా 50 వేల ట్యాంకర్లు సరఫరా చేశారు. గత ఏడాది మార్చిలో 1,69,452 ట్యాంకర్లను సరఫరా చేయగా, ఈ సంవత్సరం ఇప్పటికే 50 వేల ట్యాంకర్లు బుక్ అయినట్టు అధికారులు తెలిపారు.
గత ఏడాది ఏప్రిల్ నెలలో 2,37,596, మేలో 2,27,390 ట్యాంకర్లను సరఫరా చేశారు. ఈ సారి డిమాండ్ఎక్కువగా ఉండడంతో ఈ నెల 3 రోజుల్లోనే 50 వేల వరకు ట్యాంకర్లను సరఫరా చేశామని తెలిపారు. ఈ నెల అంతా కలిపి ఇది 1.80 లక్షల ట్యాంకర్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. వచ్చే నెల రెండున్నర లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
త్వరలో 24 గంటల సరఫరా
ఒక పక్క ట్యాంకర్ల బుకింగ్లు పెరుగుతుంటే.. ఫిల్లింగ్ స్టేషన్లలో ఆ స్థాయిలో వాటిని నింపే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. ఒక్కో ట్యాంకర్నీటిని నింపుకొని బయటకు వచ్చే సరికి అరగంట నుంచి 45 నిమిషాలు, కొన్ని సార్లు గంట కూడా పడుతున్నదని సిబ్బంది చెబుతున్నారు. దీంతో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో రాత్రిళ్లు కూడా ట్యాంకర్లు సరఫరా చేయాలని, డిమాండ్మరింత పెరిగితే 24 గంటల పాటు సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు.
నీటి సమస్యకు కారణాలపై సర్వే
వెస్ట్సిటీలోని కొన్ని ప్రాంతాల నుంచే భారీ సంఖ్యలో ట్యాంకర్లు బుక్ కావడంపై వాటర్బోర్డు అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్, కొండాపూర్, చందానగర్, మియా పూర్తదితర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో హైరైజ్భవనాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్కమ్యూనిటీలు అధికంగా ఉండడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటినట్టు గుర్తించారు.
ఇతర ప్రాంతాల్లో అత్యధికంగా వెయ్యి అడుగుల మేరకు బోర్లు వేయగా, ఈ ప్రాంతాల్లో 2 వేల ఫీట్లు వేసినా నీళ్లు రావడం లేదని చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతాల నుంచే గత ఏడాది రోజుకు 80 వేల ట్యాంకర్లు బుక్అయినట్టు గుర్తించారు. ఈ సారి కూడా అవే ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో బుకింగ్స్వస్తున్నాయని అధికారులు తెలిపారు. వెస్ట్సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు ఎక్కువగా లేవని గుర్తించారు.
దీంతో ఇప్పటి వరకూ 40 వేల మందికి నోటీసులు జారీ చేసినట్టు మెట్రోవాటర్బోర్డు రెయిన్వాటర్హార్వెస్టింగ్ విభాగం ఆఫీసర్లు తెలిపారు. వారు ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా కౌన్సెలింగ్ఇచ్చామని, చాలా మంది వాటిని నిర్మించుకుంటున్నారని చెప్పారు. దీని ఫలితాలు వచ్చే వర్షాకాలం తర్వాత తెలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోని వారి నుంచి ట్యాంకర్చార్జీలు రెట్టింపు వసూలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ
మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యమవుతుండ డంతో కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు (5వేల లీటర్లు) రూ. 500, కమర్షియల్ అయితే (5 వేల లీటర్లు) రూ. 850 వసూలు చేస్తున్నది. అదే ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు మాత్రం ఒక్కో ట్యాంకర్కు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాకా వసూలు చేస్తున్నారు.
శివారు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ పెరిగింది. కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమంగా బోర్లు వేసి నీళ్లను తోడుతున్నారు. వారు కూడా రోజుకు 1500 నుంచి 2 వేల ట్యాంకర్లను అమ్ముకుంటున్నట్టు సమాచారం.
మూడేండ్లలో వాటర్బోర్డు ట్యాంకర్ల సరఫరా ఇలా..
సంవత్సరం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే
2022-23 86,497 1,12,594 1,60,000 1,40,000
2023-24 1,12,926 1,69,452 2,37,576 2,27,390
2024-25 1,50,000 – – –