
బర్మింగ్హామ్: రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందాన్ని ఆస్వాదిస్తున్న అభిమానులకు ఇండియా వెటరన్ ఆటగాళ్లు మరో బొనాంజా అందించారు. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టీ20 లీగ్లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా చాంపియన్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చాంపియన్స్ జట్టును ఓడించింది. శనివారం రాత్రి ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఇండియా 5 వికెట్లతో పాక్పై గెలిచింది.
తొలుత పాక్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 156/6 స్కోరు చేసింది. షోయబ్ మాలిక్ (36 బాల్స్లో 3 సిక్సర్లతో 41) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో అనురీత్ సింగ్ మూడు, విజయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ పడగొట్టారు. ఛేజింగ్లో ఇండియా 19.1 ఓవర్లలోనే 159/5 స్కోరు చేసి గెలిచింది. అంబటి రాయుడు (30 బాల్స్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) ఫిఫ్టీతో సత్తా చాటగా, గుర్కీరత్ సింగ్ (34) రాణించాడు. చివర్లో యూసుఫ్ పఠాన్ (16 బాల్స్1 ఫోర్, 3 సిక్సర్లతో 30) మెరుపు బ్యాటింగ్తో ఇండియాను గెలిపించాడు.