
- అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన
హైదరాబాద్, వెలుగు: త్వరలోనే టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శనివారం అసెంబ్లీలో విద్యా శాఖ పద్దుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. బాసర ట్రిపుల్ఐటీలో ఉన్న సమస్యపై నివేదిక తెప్పించుకున్నామని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ‘మన ఊరు మన బడి’కింద ఎవరైనా స్కూల్ బాగు కోసం విరాళాలిస్తే వారికి తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఫీజుల నియంత్రణపై సబ్ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ విషయంపై గతంలో తిరుపతిరావు కమిటీ వేశామని, జీవో ఆధారంగా ఫీజుల నియంత్రణ ఉండదని హైకోర్టు చెప్పిందని ఆమె గుర్తుచేశారు. వచ్చే మూడేండ్లలో సర్కార్ బడుల్లో అన్ని సౌలతులు కల్పిస్తామని, ఎక్కువ మంది స్టూడెంట్లు ఉన్న స్కూళ్లకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మండలం ఒక యూనిట్గా తీసుకొని, మొత్తం 9,123 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు, దీని కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. టీచర్లకు ప్రమోషన్లు, ప్రైమరీ స్కూళ్లలో హెడ్మాస్టర్ల భర్తీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే సర్కార్ స్కూళ్లలో టీసీ లేకుండానే అడ్మిషన్లు కల్పించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఖాళీల్లో ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయని, కాంట్రాక్టు పోస్టుల్లో రెగ్యులర్ అయ్యే వాళ్లు కూడా ఈ శాఖ నుంచే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిపారు.
ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు ఇవ్వాలె: శ్రీధర్ బాబు
ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరారు. అలాగే ఒక్క స్టూడెంట్ ఉన్న స్కూళ్లను కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జపాన్లో ఒక స్టూడెంట్ కోసం ఏకంగా ట్రైన్ నడిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.