
హైదరాబాద్సిటీ, వెలుగు: మూసీ నదికి ఉత్తరాన కోర్ సిటీలో సీవరేజి వ్యవస్థను ఆధునికీకరించడంతోపాటు మరింతగా విస్తరిస్తామని మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి తెలిపారు. జోన్–3 సీవరేజ్నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత టోలిచౌకి ఫ్లై ఓవర్ మెయిన్రోడ్డుపై చేపట్టే జంక్షన్ పనులపై చర్చించారు.
దాదాపు 8 నుంచి 11 మీటర్లు లోతులో జరిగే టన్నెలింగ్ పనులను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రద్దీ లేని సమయాల్లో, సెలవు రోజుల్లో నిర్వహించాలని అధికారులకు సూచించారు. అక్కడి నుంచి సమీపంలోని 7 టూంబ్స్ వెళ్లే దారిలో అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ పనులను పరిశీలించారు. మార్చి మొదటి వారం వరకు ఈ స్ట్రెచ్ పూర్తయ్యేలా రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టాలన్నారు.
అనంతరం ఎండీ లైన్స్, గుడిమల్కాపూర్, గిరకపల్లి తదితర ప్రాంతాల్లో పురోగతిలో ఉన్న పైపులైన్ విస్తరణ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ముస్లింలకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టి మే వరకు పూర్తి చేయాలని ఎండీ అశోక్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.