
అమరావతి: రాజధాని పేరుతో ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో, ఎంత నొక్కారో తేలుస్తామని తెలిపారు ఏపీ మంత్రి పేర్ని నాని. కేబినెట్ భేటీ తర్వాత శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తామని చెప్పారు. నైతిక విలువలను దిగజార్చేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. భారీస్థాయిలో భూములు ఎవరెవరు కొన్నారో విచారణలో తేలుస్తామన్న పేర్ని.. న్యాయనిపుణుల సలహా తీసుకుని లోకాయుక్త లేదా సీబీఐ దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాజధాని ప్రకటనకు ముందే
సీఆర్డీఏలో జరిగిన అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని.. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర దర్యాప్తు చేయిస్తామన్నారు. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లుగా గత ప్రభుత్వంలోని పెద్దల తీరు ఉందని చెప్పారు. రాజధాని ప్రకటనకు ముందే మాజీ మంత్రులు, కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు, ఇంట్లో పనివాళ్ల పేరుతో భారీగా భూములు కొన్నారని తెలిపారు. వీటిన్నంటిపైనా వాళ్లు కోరుకున్నట్టుగానే సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నారాయణ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఊహాజనిత రాజధాని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను కాదని నారాయణ కమిటీ నివేదిక ఆధారంగా భూసమీకరణ చేశారని మంత్రి నాని తెలిపారు.