
ముషీరాబాద్, వెలుగు: నీరా కేఫ్ వేలం పాటతో గౌడన్నల ఆత్మ గౌరవాన్ని మంట కలుపుతారా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లుగీత సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో సోమవారం నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ వద్ద నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. నీరా కేఫ్లో ఉన్న వృత్తికి సంబంధించిన నమూనాలను తొలగించి టూరిజం హోటల్గా మార్చడం దుర్మార్గమన్నారు. వారం లోపు నీరా కేఫ్ భవనాన్ని గీత కార్పొరేషన్ సంస్థకు అప్ప జెప్పాలని డిమాండ్ చేశారు.
లేకపోతే లక్షలాది గౌడ జన సమూహంతో భవనాన్ని సొంతం చేసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గౌడ సంఘాలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ, చలో హైదరాబాద్ తేదీ ప్రకటిస్తామని తెలిపారు. ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బండి సాయన్న, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, అంబాల నారాయణ గౌడ్, ఆయిలి వెంకన్న గౌడ్, పంజాల జైహింద్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, కిషోర్ గౌడ్, సదానందం, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.