
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం తాగునీటికి ఎక్కడా సమస్య లేదని, కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారం పోగానే తాగునీరు రావడం లేదనే దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత, తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆమె ఇవాళ మిషన్ భగీరథ కార్యాలయంలో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
'మిషన్ భగీరథలో అప్పటి అధికారులు, సిబ్బందే పనిచేస్తున్నారు. రిజర్వాయర్లలో తాగునీటికి తగినంత నీటి నిలువలు ఉన్నాయి. గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా ఈసారి సరఫరా చేస్తున్నాం. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో, ఏజెన్సీ గ్రామాల్లో బోర్లు వేసి తాగునీరు అందిస్తున్నాం' అన్నారు.
ALSO READ | మండలిలో గందరగోళం .. జూపల్లి వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
తాగు నీటి సమస్యలు, నీటి కట కటా అంటూ ఈ మధ్య వార్త పత్రికల్లో వచ్చిన కథనాల పట్ల సీరియస్ అయిన మంత్రి సీతక్క... ఆయా కథనాలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏదైనా సాంకేతిక కారణాలతో అవాంతరాలు ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తాగునీటి అవసరాలకు ప్రతి కలెక్టర్ వద్ద రూ.2కోట్లు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో 24 గంటల పాటు పని చేసేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. వేసవి ముగిసే వరకు నిరంతరంగా సమీక్షలు నిర్వహిస్తానన్నారు.