
- టెర్రర్ దాడిలో కన్నుమూసిన వారికి శ్రీనగర్లో నివాళి
- బాధిత కుటుంబాలు, గాయపడ్డవారికి కేంద్ర హోం మంత్రి పరామర్శ
- ఘటనా స్థలిలో ఏరియల్ సర్వే.. పోలీసు అధికారులతో రివ్యూ
శ్రీనగర్: టెర్రరిజానికి భారత్ తలొగ్గదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. టెర్రర్ అటాక్కు పాల్పడ్డవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి ఆయన నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్కు చేరుకున్న అమిత్ షా.. స్థానిక పోలీస్కంట్రోల్రూంలో ఉంచిన మృతదేహాలపై పుష్పగుచ్ఛం సమర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబాలను కలిసి, పరామర్శించారు.
ఆ సమయంలో బాధిత కుటుంబాలు కన్నీళ్లతో షాను వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఈ దుర్ఘటనకు కారణమైన వారిని వెతికి పట్టుకొని, శిక్షించి తీరుతామని బాధిత కుటుంబాలకు అమిత్ షా స్పష్టం చేశారు. ఆయన వెంట జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నారు.
అనంతరం అమిత్ షా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘భారమైన హృదయంతో పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పిస్తున్నా. బాధితుల ఆవేదనను ప్రతీ భారతీయుడు అనుభవిస్తున్నాడు. ఈ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేం. ఉగ్రవాదానికి దేశం తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని విడిచిపెట్టం. బాధిత కుటుంబాలతోపాటు యావత్ దేశానికి నేను హామీ ఇస్తున్నా” అని ట్వీట్ చేశారు.
ఏరియల్ సర్వే నిర్వహించిన షా
ఉగ్రదాడి జరిగిన పహల్గామ్లోని బైసరన్ ప్రాంతంలో అమిత్ షా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ దాడికి సంబంధించి అధికారుల నుంచి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అక్కడి పరిస్థితిని అమిత్షాకు జమ్మూకాశ్మీర్ డీజీపీ నలిన్ప్రభాత్ వివరించారు.
అనంతరం పహల్గామ్ ఉగ్రవాద దాడిలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అమిత్ షా అనంత్నాగ్లోని ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్నవారిని కలిసి, ధైర్యం చెప్పారు. అమిత్షా వెంట లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉన్నారు.