
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కోసం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ సీజన్లో నగరంలో మొత్తం తొమ్మిది మ్యాచ్లు జరగనున్నాయి. వీటి కోసం గ్రౌండ్, పిచ్లను సిద్ధం చేయడంతో పాటు స్టేడియానికి రంగులు వేసే పనిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిమగ్నమైంది.
ఈ సీజన్ మ్యాచ్లకు హాజరయ్యే ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూస్తామనిహెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ( ఎస్జాట్) 2025 వార్షిక డైరీని సంఘం ప్రతినిధులు జగన్తో పాటు వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాసరావుకు అందించారు.