
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిచినో సహకారం తీసుకుంటామని ప్లానింగ్ కమిషన్ వైస్చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు. ఆయన నేతృత్వంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీ బృందం జపాన్లోని ఒసాకాలో ఉన్న నిచినో రిసర్చ్ సెంటర్ను సందర్శించింది.
అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రముఖ ఆగ్రోకెమికల్ కంపెనీలలో నిచినో ఒకటని తెలిపారు. ఈ సంస్థ తెలంగాణ భాగస్వామిగా ఉందన్నారు. ఈ సందర్భంగా నిచినో తమ తాజా ఆవిష్కరణలైన పురుగు మందులు, శిలీంద్ర నాశకాలు కలుపు మందులను ప్రదర్శించింది. అత్యాధునిక పరిశోధన సౌకర్యాల గురించి నిచినో ప్రతినిధులు తెలంగాణ బృందానికి వివరించారు. నిచినో బృందంలోని డాక్టర్ కజుహికో మోటోబా, డాక్టర్ ప్రశాంత్ టీమ్ కు చిన్నారెడ్డి బృందం కృతజ్ఞతలు తెలిపింది.