Rice Crop: రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో నారు మొక్కలను పెంచారు. కొన్ని నాటు కూడా వేశారు. వరి మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా విరివిగా పెరుగుతున్నాయి. వరి మొక్కలకు కృత్రిమంగాఅందించే పోషకాలను కలుపు మొక్కలు అందుకోవడంతో అవి బాగా ఏపుగా పెరిగడంతో వరి దిగుబడి బాగా తగ్గిపోతుంది. అందుకే వరి పంటలో వచ్చే కలుపు మొక్కలను నాశనం చేయాలి. కలుపు మొక్కలను ఎలా నివారించడానికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . .
వరి పంటలో కలుపు మొక్కలు పెరగడం వలన 90 శాతం నష్టం జరుగుతుంది. అందుకే వరిలో కలుపు రాకుండా నివారించే,పైరులో ఆశించిన కలుపును నివారించే పద్ధతులు పాటించాలి. అవకాశం ఉన్నంతవరకు పొలంలో కలుపు రాకుండా నివారించుకోవటం మంచిది.
కలుపు రాకుండా నివారించే పద్ధతులు
- నేల సమతలంగా లేని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువ. కాబట్టి పైరు విత్తేముందే నేలను చదును చేయాలి.
- వేసవిలో లోతు దుక్కులు దున్నటం వల్ల పొలంలో ఉన్న తుంగ, గరిక వంటి మొండి జాతి కలుపు నివారించవచ్చు.
- తొలకరి వర్షాలు మొదలైన వెంటనే నేలను వీలైనన్ని ఎక్కువసార్లు గొర్రు, గుంటకలతో దున్నటం వల్ల నేల పైపొరలలోని కలుపు విత్తనాలు చాలా
- వరకు మొలక దశలోనే అంతరించి, పంటతో పాటుగా వచ్చే కలుపు మొక్కలు చాలా వరకు తగ్గిపోతాయి.
- రైతులు సాగుచేసే భూములను ఎంతో జాగ్రత్తగా కలుపు లేకుండా చూసుకుంటారు. అంతే శ్రద్ధతో పొలంగట్లు, పొలాలకు వెళ్ళే డొంకలు, రోడ్ల పక్క ప్రదేశాలలో కలుపు లేకుండా చూసుకుంటే కలుపు విత్తనం ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది.
- గ్రామాలలో చెరువు గట్లు, కాలువ గట్లు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాలలో కలుపు మొక్కలు పెరగనీయకుండా చేస్తే పంట పొలాల్లో కలుపు సమస్య తగ్గుతుంది.
- పశువుల ఎరువు పొలానికి వేసినపుడు దానిలో ఉండే కలుపు విత్తనాల ద్వారా వచ్చే కలుపును నివారించుకోటానికి తొలకరి వర్షాలకు పొలాన్ని దున్ని ఎరువుతో పాటుగా వచ్చే కలుపు పైరు వేయకముందే మొలిచి నశించేలా చేయాలి.
- కలుపు ... విత్తనాలలో కలవకుండా పంట విత్తనాలు మాత్రమే విత్తేందుకు వాడాలి.
- పంట మొక్కల సాంద్రత పొలంలో సరిపడా ఉన్నపుడు కలుపు ఉదృతిని పైరు అడ్డుకుంటుంది.
- పంట విత్తనాలు చల్లటం కంటే, యంత్ర పరికరాలు ఉపయోగించి సిఫారసు చేసిన ఎడంతో, సిఫారసు మేరకు విత్తన మోతాదు పాటించి, సరైన పద్ధతిలో విత్తినపుడు కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.
- పైరు వేయటానికి కొంత సమయం ఉన్నపుడు పొలంలో పచ్చి రొట్ట పైర్లు సాగుచేసి కలుపు ఉధృతి తగ్గించుకోవాలి.
- పంటకోసిన తరువాత పొలంలో మిగిలిపోయే కలుపు మొక్కలను వెంటనే నాశనం చేయాలి. అలా చేయనపుడు వాటి ద్వారా విత్తనం ఉత్పత్తి జరిగి తరువాత సాగు చేసే పైర్లలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది.