వారసత్వ సంపదను కాపాడుకోవాలి : మంత్రి సీతక్క

వారసత్వ సంపదను కాపాడుకోవాలి :  మంత్రి సీతక్క
  • పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క

వెంకటాపూర్​(రామప్ప)/ ఏటూరునాగారం, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత విలువైన వారసత్వ సంపద భారతదేశంలో ఉందని, అందులో యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయుల కట్టడం రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం ములుగు జిల్లాలో ఉండడం గర్వకారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంచుకోవాలని వలంటీర్లకు సూచించారు.

వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంప్–2024 కార్యక్రమంలో భాగంగా వారం రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసింది. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ విజయబాబు తెలంగాణ దేవాలయాలు టూరిజంపై వివరించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్​రెడ్డి ఆన్​లైన్​లో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, టూరిజం శాఖ చేస్తున్న సర్వీసుల గురించి తెలిపారు. తెలంగాణ టూరిజం పర్యాటక స్థలాలు, విశిష్టత, ప్రపంచ, దేశీయ, రాష్ట్రీయ పర్యాటక డిపార్ట్మెంట్ల గురించి ములుగు జిల్లా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ వలంటీర్లకు వివరించారు.

ముగింపు కార్యక్రమలో మంత్రి సీతక్క పాల్గొని విద్యార్థులకు రామప్ప చరిత్రగురించి ఉపన్యసించారు. రామప్ప, కాకతీయుల చరిత్రను గుర్తు చేస్తూ రామప్ప ప్రపంచ స్థాయికి ఎదిగిన అంశాలపై ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్​ పాండురంగారావు ప్రశంసించారు. ఇదిలా ఉండగా, ఏటూరునాగారం మండలం షాపల్లికి చెందిన కాంగ్రెస్ మండల సహాయ కార్యదర్శి ముద్రబోయిన రఘు ఇటీవల మృతి చెందగా, దశదినకర్మకు హాజరైన మంత్రి సీతక్క కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మండల పార్టీ కార్యకర్తల సహకారంతో కాంగ్రెస్​పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాల అశోక్, కార్యకర్తలతో కలిసి తక్షణ సాయంగా మృతుడి కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. రఘు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చిన్నబోయినపల్లిలలో 29 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, బ్లాక్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, పార్టీ మండలాధ్యక్షుడు చిటమట రఘు తదితరులు పాల్గొన్నారు.