ఇక అర్బన్​ ట్రాన్స్​పోర్ట్​ ఫండ్? ప్రజా రవాణా అభివృద్ధి, ట్రాఫిక్​ పరిష్కారానికి ఉమ్టా ప్రపోజల్స్​

ఇక అర్బన్​ ట్రాన్స్​పోర్ట్​ ఫండ్? ప్రజా రవాణా అభివృద్ధి,  ట్రాఫిక్​ పరిష్కారానికి  ఉమ్టా ప్రపోజల్స్​
  • ప్రభుత్వానికి ఉమ్టా ప్రపోజల్స్​..  
  • రిజిస్ట్రేషన్లు, పెట్రో, డీజిల్ పై పన్ను తరలించాలని ప్రపోజల్స్​
  • డెవలప్​మెంట్​ ఫండ్ కొనసాగింపు 
  •  సీబీడీ సెస్​పైనా ఆలోచన 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఔటర్​ రింగ్​రోడ్​ నుంచి ట్రిపుల్​ఆర్​వరకూ ఎక్స్​టెండ్​అవుతోంది. దీనికి తగ్గట్టుగా ప్రజా రవాణా, మౌలిక సదుపాయల కల్పన అవసరమని ప్రభుత్వం, అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల నేపథ్యంలో మెరుగైన ప్రజా రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్​ సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై విధి విధానాలను రూపొందించేందుకు హెచ్ఎండీఏలోని అర్బన్​ మెట్రోపాలిటన్​ట్రాన్స్​పోర్ట్​ అథారిటీ( ఉమ్టా) నేతృత్వంలో సమగ్ర ట్రాన్స్​పోర్ట్​సర్వే చేయిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అవసరాల కోసం  నిధులు అవసరమవుతాయి కాబట్టి అర్బన్​ ట్రాన్స్​పోర్ట్​ ఫండ్​ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉమ్టా భావిస్తోంది. కావాల్సిన ఫండ్​ రెయిజ్​ చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రపోజల్స్​ సిద్ధం చేసినట్టు సమాచారం.  

నిధులు సేకరించే ప్లాన్​ ఇలా..

యూటీఎఫ్​కు ఫండ్స్​సమకూర్చడానికి అవసరమైన మార్గాలను ఉమ్టా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో రోజుకు దాదాపు 3 వేల నుంచి 4 వేల వాహనాలు విక్రయం జరుగుతున్నాయని గుర్తించింది. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తోంది. ఈ  ఆదాయం నుంచి కొంత యూటీఎఫ్ కు తరలించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే, పెట్రోల్, డీజిల్​అమ్మకాల పై ప్రభుత్వం విధిస్తున్న పన్నుల్లో కొంత యూటీఎఫ్​కు తరలించాలని ప్రపోజల్స్ ​పెట్టింది. హెచ్ఎండీఏ చట్టం ప్రకారం నగరంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టులో హెచ్ఎండీఏకు 1.25 శాతం డెవలప్​మెంట్​ఫండ్ కింద చెల్లించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం ఇది అమలు కావడం లేదు. దీన్ని కూడా ఇంప్లిమెంట్​చేస్తే యూటీఎఫ్​కు కావాల్సినంత ఫండ్​ సమకూరుతుందని ఆలోచిస్తోంది. 

సెంట్రల్ ​బిజినెస్​ డిస్ట్రిక్ట్స్​సెస్​

దేశంలోని కొన్ని నగరాల్లో సెంట్రల్​బిజినెస్​ డిస్ట్రిక్ట్స్​(సీబీడీ)ఉన్నాయి. ఆయా జోన్లలో వివిధ వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని ఆధారంగా సికింద్రాబాద్​, మాదాపూర్​, హైటెక్​ సిటీ, అమీర్​పేట, అబిడ్స్​వంటి కొన్ని ప్రాంతాలను సీబీడీలుగా ప్రకటించి నిర్ణీత సమయాల్లో ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే ప్రైవేట్ ​వెహికల్స్ ​దగ్గర సెస్​ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేసే విషయంపై కూడా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.