IND vs ENG: రిజర్వ్ డే లేదు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు టీమిండియా!

IND vs ENG: రిజర్వ్ డే లేదు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు టీమిండియా!

అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరుగుతోన్న పొట్టి ప్రపంచకప్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కీలక సెమీ ఫైనల్ మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. పోనీ, వరుణుడు అంతరాయం కలిగించినప్పటికీ.. మరుసటి మ్యాచ్ కొనసాగిద్దామన్న ఒకదానికి రిజర్వ్‌డే ఉంటే, మరొక మ్యాచ్‌కు ఆ అవకాశం లేదు. దాంతో, అభిమానుల్లో కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్షం కారణంగా సెమీస్ మ్యాచ్‌లు రద్దయితే పరిస్థితి ఏంటన్న టాక్ వినపడుతోంది. అందుకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 

తొలి సెమీస్‌కు రిజర్వ్‌డే

ట్రినిడాడ్‌ వేదికగా అఫ్ఘనిస్తాన్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి సెమీ ఫైనల్‌కు రిజర్వుడేని నిర్ణయించారు. ఈ లెక్కన తొలి రోజు ఆట రద్దయినా.. మరుసటి నిర్వహిస్తారు. రిజర్వ్‌డే రోజు 190 నిమిషాల అదనపు సమయం కూడా కల్పించారు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశాలు ఎక్కువుగానే ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా అదికూడా సాధ్యంకాని పక్షంలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఫైనల్స్‌కు వెళుతుంది. ఈ రకంగా చూస్తే దక్షిణాఫ్రికా తుదిపోరుకు వెళ్లే అవకాశాలున్నాయి. 

గయానాలో భారీ వర్షం..!

ఇక గురువారం(జూన్ 27) రాత్రి 8 గంటలకు భారత్‌- ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్ తడుచుకు పెట్టుకుపోయేలా ఉంది. మ్యాచ్ జరగాల్సిన గయానాలో ప్రతికూల వాతావరణం ఉంది. వాతావరణ నివేదికల ప్రకారం, జూన్ 27న గయానాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వర్షం పడే అవకాశం 61 శాతంగా ఉండగా.. రెండు గంటల సమయం అనంతరం  50 శాతానికి పైగా ఉంది. 

రిజర్వ్ డే లేదు

ఐసీసీ మొదట ప్రకటించిన షెడ్యూల్‌లో రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు. అయితే, మరుసటి రోజే ఫైనల్ ఉండటంతో.. రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు తుది పోరులో ఆడటానికి  కనీసం 24 గంటల సమయం కూడా కేటాయించలేదు. ఈ షెడ్యూల్‌పై విమర్శలు రావడంతో ఐసీసీ రిజర్వ్‌డేను ఎత్తేసింది. ఒకేరోజు అదనంగా 250 నిమిషాలు కేటాయించారు. ఆలోపు మ్యాచ్ పూర్తయితే ఒకే, లేదంటే సెకండ్ రౌండ్ గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఈ రకంగా చూస్తే భారత జట్టు ఫైనల్లో అడుగు పెట్టనుంది.

10 ఓవర్లు జరిగితేనే DLS

ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. ఒకవేళ సెమీస్‌ మ్యాచ్‌లకు వర్షం కలిగించి డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి దారి తీస్తే.. ఇరు జట్లు 10 ఓవర్లు ఆడివుంటేనే ఫలితాన్ని నిర్ణయిస్తారు. అంతేగానీ.. గ్రూప్‌, సూపర్‌-8 దశలో వలే 5 ఓవర్లు ఆడితే చాలదు.