Bonalu 2024 : బోనం అంటే ఏమిటి... అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా...

Bonalu 2024 :  బోనం అంటే ఏమిటి... అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా...

 తెలంగాణలో ప్రత్యేకమైన అతిపెద్ద జాతర బోనాల పండగ.. ఈ ఆదివారం(  జులై 7) ఆషాడంలో వచ్చే తొలి ఆదివారం గోల్కొండ బోనాలతో నగరంలో బోనాల సందడి జరుగనుంది. తొలుత గోల్కొండ, తరవాత సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, ఆ తరవాత పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. బోనం అంటే భోజనం అని అర్ధం. ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం. అమ్మవారికి భక్తిశ్రద్దలతో వండిన ఆహారాన్ని ఆరగింపు చేయడం లేదా బోనం సమర్పించడం ఆనవాయితీ. 

సాధారణంగా ఇది పల్లె ప్రజల పండగ. ఓ రకంగా ప్రకృతిని ప్రేమించే పండగ. తమ పంటలను కాపాడుతున్న గ్రామ దేవత కు భక్తి పూర్వకంగా సమర్పించుకునే భోజనమే..బోనం..ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. ఆలావండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడ్తారు. అలాగే ఆ కుండా పై ఒక దీపాన్ని ఉంచుతారు.ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభ్రమైనది కూడా. అలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి క్రిమి కీటకాలు దరిచేరకుండా చేస్తారు. ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్‌, ‌యాంటీ బైయోటిక్‌కి సంబంధించి నవే కాబట్టి .... దీని వెనక శాస్త్రీయత కూడా జోడించారు. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు దారి చూపి స్తుందని పెద్దల భావన. 

మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లంతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పి స్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. ప్రస్తుత రోజుల్లో ...  దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయి తీగా మారింది. 

పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు,నగలు ధరిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలకు.... దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు. ముఖ్యంగా వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం బాద్రపద మాసంలో ఇది ముగుస్తుంది.  ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వారు నిర్వహించుకుంటారు.

వానాకాలంలో మనకు కలరా,మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి.వానా కాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం. సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువులకే వచ్చే ప్రమాదంకూడా ఉంది.అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అంటే ఓ రకంగా వానాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షించమని అమ్మవారిని కోరుకుంటూ పూజలు చేసి, బోనం సమర్పించడం ఇందులోని పరమార్థంగా గుర్తించాలి. ఆషాఢ, శ్రావణ మసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళల కు అరి కాళ్ళు చెడతాయి.  అలా కాకుండా మహిళలు పసుపును కాళ్ళకు పెట్టుకుంటారు. ఇది కూడా ఓ రకంగా వైద్యపరంగా ముందు జాగ్రత్తగా చెప్పుకోవాలి.

 బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడతారు కనుక ఆ వేపాకులో ఉండే గుణం క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది. అలాగే ఇళ్లలోకి రాకుండ ఆచేస్తుంది. కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రధానంగా వాడుతారు. వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి అంటూ వ్యాధులు మనకురావు. బోనాల పండుగలో ముఖ్యమైనది బలి. ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు. ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు లేకున్నా..ఓ మూఢాఛారం గా వస్తోంది. అమ్మవారికి ఇలా బలి ఆమె సంతోషపడి కోరిన కోర్కెలు నెరవేరుస్తుందన్న నమ్మిక మాత్రమే. 

సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలైయే వానా కాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తా రు. బహుశా అందువలననేమో శ్రావణ మాసంలో కొంత మంది మాంసాహారం తినరు. బోనాల పండుగలో ముఖ్యమై న ఘట్టం అమ్మవారి ఊరేగింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు, పోత రాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు.ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి. 

ఊరేగింపు సమయంలో డప్పుచప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు. అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు, పక్షలు, కీటకాలు భయంతో పారిపోతాయి. అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు.ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే. వానా కాలంలో దోమలు, ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి. అప్పుడు ఆ పొగ వల్ల అటు వంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి గుగ్గిలం పొగలు వేస్తారు.

బోనాలు అమ్మవారుని పూజిం చే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాద్​, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. అయితే తెలంగాణ ప్రజలు అత్యంత భక్తితో, సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. ముఖ్యంగా భాగ్యనగరం లష్కర్‌ ‌జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తరువాత సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగాను నిర్వహిస్తారు ఆ తరువాత చివరగా లాల్‌ ‌దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర చోట్ల నిర్వహిస్తారు ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు.